కర్ణాటక 'కేబినెట్'పై ప్రతిష్టంభన?: ఆ శాఖ పైనే ఇరువురి కన్ను!, ఎటూ తేలని వైనం..
న్యూఢిల్లీ: రెండు పార్టీలు కలిసి మొత్తానికి యడ్యూరప్పను గద్దె దించి.. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాయి. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా.. పదవుల కోసం కలహాలు మాత్రం తప్పడం లేదు. పలు కీలక శాఖల కోసం ఇరు పార్టీలు తెగ ప్రయత్నిస్తుండటంతో మంత్రిత్వ శాఖల కేటాయింపు గందరగోళంగా మారింది. అదే సమయంలో ఆశావహుల్లో అసంతృప్తి తీవ్రంగానే కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య మంత్రిత్వ శాఖల సర్దుబాటు ఏవిధంగా ఉంటుందన్నది ఎటూ తేలని అంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఒత్తిడిఫ
మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పై శాసనసభ పక్షం నుంచి ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఉంది. దానిపై త్వరగా ఏదో ఒకటి తేల్చేయాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణుల సమాచారం మేరకు.. ఆర్థిక శాఖ సహా కీలకమైన 4 శాఖలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

ఆర్థిక శాఖపై ఇరువురి కన్ను:
రైతు రుణమాఫీ క్రెడిట్ కోసం ఇరు పార్టీలు పాకులాడుతుండటంతో.. ఆర్థిక శాఖను తమ వద్దే ఉంచుకోవడానికి రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. అటు కుమారస్వామి, ఇటు సిద్దరామయ్య ఆ శాఖ మాకంటే మాకే అనే రీతిలో అంతర్గతంగా కుస్తీ పడుతున్నారు. దీంతో ఈ కీలకమైన శాఖను ఎవరికి కేటాయిస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది. ఇదిలా ఉంటే, పార్టీ తరుపున తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు సైతం తమకు మంత్రి పదవులు కావాలని పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ తలపట్టుకుంది.

శివకుమార్ వర్సెస్ రేవణ్ణ
మరోవైపు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, సీఎం సోదరుడు రేవణ్ణలు పీడబ్ల్యూడీ శాఖ కోసం చాలానే ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సంకీర్ణంపై కాంగ్రెస్ చిత్తశుద్దిని బయటపెట్టేలా జేడీఎస్ ప్రయత్నాలు సాగిస్తోందన్న వాదన కూడా వినిపిస్తంది. బేషరతుగా మద్దతునిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడిన్ని కొర్రీలు పెట్టడం తగదని జేడీఎస్ అభిప్రాయపడుతోంది.
ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాల నుంచి వచ్చాకే ఈ మంత్రి పదవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆయన చెప్పిన నాయకులకే మంత్రి పదవులు ఖరారయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో జేడీఎస్ తో మంత్రి పదవుల సర్దుబాటు విషయాన్ని రాహుల్ కే వదిలేయాలని పార్టీ ట్రబుల్ షూటర్ గులాంనబీ ఆజాద్ భావిస్తున్నట్టు సమాచారం.

రాహుల్ పుణ్యాత్ముడు: కుమారస్వామి
తాను ప్రజల ఓట్లతో సీఎం కాలేదని, కాంగ్రెస్ తనపై దయ తలచడంతోనే సీఎం అయ్యానని కుమారస్వామి ఇదివరకు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో కామెంట్ చేశారు. 'ఈరోజు నాకు ప్రజల ఆశీస్సులు లేకున్నా పుణ్యాత్ముడు రాహుల్ నాపై నమ్మకం ఉంచడం వల్లే అధికారం దక్కింది. ఆయన్ని కూడా విశ్వాసంలోకి తీసుకునే ఓ నిర్ణయం తీసుకుంటా' అని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కాగా, ప్రజల కంటే కాంగ్రెసే తన హైకమాండ్ అన్న రీతిలో కుమారస్వామి వ్యవహరిస్తుండటంపై ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications