సీఎల్పీ భేటీ వేళ- ఆ ఆశ్రమానికి డీకేశి: ఆధ్యాత్మిక గురువుతో..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్ను సాధించింది కాంగ్రెస్. 1989 తరువాత ఈ స్థాయి ఓట్ షేర్ను కాంగ్రెస్ అందుకోవడం ఇదే తొలిసారి.
భారతీయ జనతా పార్టీ 66 నియోజకవర్గాలకే పరిమితమైంది. 118 నుంచి 66 స్థానాలకు పడిపోయింది బీజేపీ సంఖ్యాబలం. రాత్రికి రాత్రి జయనగర ఫలితం తారుమారు కావడంతో కాంగ్రెస్ ఖాతాలో ఒక సీటు తగ్గింది. జయనగరలో నిర్వహించిన రీకౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థిని సౌమ్యా రెడ్డి 16 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సీకే రామ్మూర్తి విజయం సాధించారు.

కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవ్వాళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. ఈ సాయంత్రం 5:30 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఈ భేటీ ఏర్పాటయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి ప్రధాన కారకులైన డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల్లో ఒకరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో- డీకే శివకుమార్ తన ఆధ్యాత్మిక గురువు అజ్జయ్యను కలుసుకోబోతోన్నారు.. ఆశీర్వాదాన్ని తీసుకోనున్నారు. దీనికోసం ఆయన తుమకూరు జిల్లాలోని నోనవినకెరెకు బయలుదేరి వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సమయంలోనూ ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు డీకేశి. గతంలో చాలాసార్లు ఆయన ఆశ్రమానికి వెళ్లారు.

ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో- మరోసారి నోనవినకెరె ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 136 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఈ ఏడాది జనవరిలోనే అంచనా వేశారు డీకే శివకుమార్. ఎన్నికల ప్రచారంలో సైతం ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు 136 స్థానాలు దక్కాయని గుర్తు చేశారు. ఇదంతా తన గురువు అజ్జయ్య చలవేనని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications