నా మాట విన్నందుకు సంతోషం: ప్రణబ్పై చిద్దూ, మా సిద్ధాంతాలు సమర్థించారు.. ఆరెస్సెస్ హ్యాపీ
నాగపూర్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తృతీయ వర్షలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. ప్రణబ్ ప్రసంగంపై బీజేపీ, కాంగ్రెస్, ఆరెస్సెస్ హర్షం వ్యక్తం చేశాయి.
ప్రణబ్ ప్రసంగం అద్భుతంగా ఉందని చిదంబరం ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏమిటో ఆరెస్సెస్కు ప్రణబ్ తెలిపినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే, ఆరెస్సెస్ సిద్ధాంతాలు కొన్ని తప్పని తనదైన శైలిలో చెప్పారంటూ ఓ ట్వీట్ చేశారు.
తన విజ్ఞప్తిని మన్నించి ఆరెస్సెస్ తప్పులేమిటో వాళ్లకు ప్రణబ్ చెప్పినందుకు సంతోషంగా ఉందన్నారు. మీరు వెళ్లి ఆరెస్సెస్ సిద్దాంతాల్లో ఉన్న లోపాలను వాళ్లకి చెప్పాలని, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చిదంబరం మొదటే మద్దతు పలికారు.
ప్రణబ్ ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, రణ్దీప్ సుర్జేవాలా కూడా ప్రశంసలు కురిపించారు. ప్రణబ్ తన ప్రసంగం ద్వారా చేసిన సలహా మేరకు ఆరెస్సెస్, బీజేపీలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయా? అని సుర్జేవాలా ప్రశ్నించారు.
ప్రణబ్ మా సిద్ధాంతాలను సమర్థిచారు
తన వ్యాఖ్యల ద్వారా ప్రణబ్ ముఖర్జీ తమ సిద్ధాంతాలను సమర్థించారని ఆరెస్సెస్ అభిప్రాయపడింది. ఆరెస్సెస్ ప్రధానంగా జాతీయవాదం వినిపిస్తుంది. ఇదే విషయాన్ని ప్రణబ్ చెప్పారు. మరోవైపు బీజేపీ కూడా ప్రణబ్ ప్రసంగంపై ఆనందంగా ఉంది.