షహిద్ కిసాన్ దివస్గా అక్టోబర్ 12: లఖింపూర్ ఖేరికి ప్రియాంక గాంధీ..రైతు నేతలు
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్ర కారు కింద పడి దుర్మరణం పాలైన రైతుల కుటుంబాలను పరామర్శించడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి విమానంలో ఈ ఉదయం లక్నో విమానాశ్రయానికి చేరుకున్న ఆమె..రోడ్డు మార్గంలో లఖింపూర్ ఖేరికి వెళ్లారు. రైతుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆమెతో పాటు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, సీనియర్ నాయకులు ధీరజ్ గుర్జర్, రోహిత్ చౌదరి, ప్రమోద్ తివారి, అరాధనా మిశ్రా పాల్గొననున్నారు.
భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ కూడా ఇదే కార్యక్రమానికి హాజరు కానున్నారు. అక్టోబర్ 12వ తేదీన షహీద్ కిసాన్ దివస్ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మంగళవారం నిర్వహించనున్నారు. రైతులు వీర మరణం పొందారని ఆయన వ్యాఖ్యానించారు. సంస్మరణ కార్యక్రమాన్ని లఖింపూర్ ఖేరి సమీపంలోని టికునియాలో గల సాహెబ్జాదా ఇంటర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేశారు. సుమారు పది వేల మందితో నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి.
షహీద్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రార్థనలు, నివాళి సమావేశాలను నిర్వహిస్తామని రాకేష్ తికాటియా తెలిపారు. ఈ సాయంత్రం కొవ్వొత్తులతో ప్రదర్శనలను నిర్వహించాలని సూచించారు. రాత్రి 8 గంటలకు ప్రజలు తమ ఇళ్ల వద్ద అయిదు కొవ్వొత్తులను వెలిగించాలని, రైతు కుటుంబాలకు నైతిక మద్దతును ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంత జరిగిన తరువాత కూడా అజయ్ కుమార్ మిశ్రాను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తొలగించకపోవడాన్ని భారతీయ కిసాన్ యూనియన్ తప్పు పట్టింది. సిగ్గుచేటని వ్యాఖ్యానించింది.
లఖింపూర్ ఖేరీ మారణకాండలో మంత్రి పాత్ర ఉందనే విషయం స్పష్టంగా తేలినప్పటికీ.. చర్యలను తీసుకోవడానికి మోడీ సర్కార్ వెనుకాడుతోందని రాకేష్ తికాటియా ఆరోపించారు. మంత్రిపై ఉన్న క్రిమినల్ కేసులు కూడా ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కేబినెట్లో నేరస్థులకు ఆశ్రయం కల్పించారని విమర్శించారు. నేరస్థులతో ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడిపించలేరని ధ్వజమెత్తారు. ఆయనను కేబినెట్ నుంచి తొలగించేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
Recommended Video
మరోవంక- లఖింపూర్ ఖేరి సెషన్స్ న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రాను పోలీసులు మూడురోజుల పాటు రిమాండ్కు తరలించారు. లఖింపూర్ ఖేరీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. బయటి వ్యక్తులను ఎవ్వరినీ పోలీసులు రానివ్వట్లేదు. రాకపోకలు సాగించడానికి పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన రైతు నేతలను పోలీసులు అడ్డుకున్నారు.