కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్: ట్వీట్ చేసిన రాహుల్
దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. విపరీతంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడి బాధితులుగా మారుతున్నారు. దేశం మొత్తం కరోనాతో పోరాటం సాగిస్తున్న వేళ పలువురు ప్రముఖులు, ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు కరోనా మహమ్మారి బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం కెసిఆర్ వంటి నాయకులు, మన్మోహన్ సింగ్ వంటి సీనియర్ రాజకీయవేత్త కరోనా మహమ్మారి బారిన పడితే, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు.
Recommended Video
రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ ... ట్వీట్ చేసిన రాహుల్
తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారికి సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించాయని, దీంతో తాను కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవల తనతో సంప్రదించిన వారందరూ ఐసోలేషన్ లోకి వెళ్లాలని కోరిన రాహుల్ గాంధీ దయచేసి అన్ని భద్రతా ప్రోటోకాల్లను పాటించాలని సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ .. కరోనా సెకండ్ వేవ్ తో ఇటీవల సభలు రద్దు
మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ, తమిళనాడులలో అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. నాలుగు దశల ఓటింగ్ జరిగిన తరువాత పశ్చిమ బెంగాల్లో తన ప్రచారాన్ని మొదలుపెట్టినా , కాని కోవిడ్ -19 ఉప్పెన కారణంగా దానిని నిలిపివేశారు. ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు . దేశంలో కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు పెరిగిన కేసుల దృష్ట్యా, ఏప్రిల్ 18 న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు తన మిగిలిన బహిరంగ ర్యాలీలను నిలిపివేశారు.
కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టని కరోనా
ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు కరోనా బారిన పడ్డారు . ప్రస్తుతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ లో కరోనా చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం కరోనా బారిన పడ్డారు.