వరదలపై మోడీ పనితీరు అధ్బుతం: దిగ్విజయ్, అజాద్
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రత్యర్దులైన కాంగ్రెస్ నేతలచేత శభాష్ అనిపించుకున్నారు. భారత్కు చిరకాల ప్రత్యర్ది పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్, నరేంద్ర మోడీని ప్రశంసించిన కొంత సేపటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ ఆయనను ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్ వరదలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తీరు అద్బుతమని కొనియాడారు.
జుమ్మూ కాశ్మీర్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో పాటు, ఆర్దిక సాయంగా రూ. 1000 కోట్లు, భద్రతాదళాలను సహాయక చర్యల్లో దింపడం... లాంటి చర్యలతో మోడీ పనితీరు బాగుందని వారు పేర్కొన్నారు. ఈ వరదల కారమంగా దాదాపు పదిహేను వేల మంది వరకు గల్లంతైనట్లుగా భావిస్తున్నారు.
ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. జాతీయ విపత్తుగా ప్రకటించారు. ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని, తాము ఆదుకుంటామని, అవసరమైన బోట్లను పంపిస్తామని, చాపర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని, విమానాలు సిద్ధంగా ఉన్నాయని ఆదివారం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.

జమ్మూ కాశ్మీర్ వరదల నేపథ్యంలో ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తదితరాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకు పోయిన వారి కోసం వీరు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. వరదల్లో చిక్కుకు పోయిన వారిని విమానాలు, హెలికాప్టర్లు, పడవల ద్వారా రక్షిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.
వర్షాలు, వరదల కారణంగా పక్క దేశమైన పాకిస్తాన్లో కూడా 160 మంది వరకు మృతి చెందారు. వేలాది ఇళ్లు నీట మునిగిపోయాయి. గత అరవై ఏళ్లలో రాష్ట్రంలో ఇంత తీవ్ర వరదలు ఎప్పుడూ సంభవించలేదని, 2500 గ్రామాలు వరద తాకిడికి గురికాగా, వాటిలో 450 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
దాదాపు పదిహేను వేల మంది ఆచూకీ లభించడం లేదని తెలుస్తోంది. రెండువేల మంది వరకు రిలీఫ్ క్యాంపుకు తరలించారు. హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నంబర్లు.. ఢిల్లీ J&K హౌజ్ - 011 24611210, 24611108; శ్రీనగర్ - 0194-2452138; జమ్ము - 0191-2560401. ఇస్రో ఇప్పటికే వరదకు సంబంధించిన చిత్రాలను పంపించింది.












Click it and Unblock the Notifications