వారణాసి: మోడీని ఎదుర్కొనేందుకు దిగ్విజయ్ సై!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నుంచి లోకసభ ఎన్నికలకు బరిలో దిగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధినాయత్వం మంతనాలు, చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
దిగ్విజయ్ సింగ్ కూడా మోడీని ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మోడీ పోటీ చేస్తున్న స్థానాల్లో బలమైన నాయకులను పోటీ దించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. మోడీని ఢీకొనే సామర్థ్యం దిగ్విజయ్ సింగ్కు ఉన్నట్లు కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది.

కాగా, మరో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు అరుణ్ జైట్లీ పోటీ చేస్తున్న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నుంచి కాంగ్రెస్ తరపున అమరిందర్ సింగ్ పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జైట్లీని అమరీందర్ సింగ్ సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడతారని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే వీరి స్థానాలను ఇంకా అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించలేదు.
ఇది ఇలా ఉండగా.. నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటివరకు మోడీ ఎక్కడ్నుంచి పోటీ చేసేది ఖరారు కాలేదు. అలాగే బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనేదానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా బుధవారం బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి కూడా అద్వానీ హాజరు కాలేదు. బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్.. అద్వానీకి ఫోన్ చేసి సమావేశానికి హాజరుకావాలని కోరారు.
అయితే అద్వానీ ఇప్పటి వరకు పోటీ చేసిన గాంధీనగర్ లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయనట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి పోటీ చేయాలని అద్వానీ కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నరేంద్ర మోడీ వడోదర నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. కాగా, గాంధీనగర్ నుంచి మోడీ సన్నిహితుడు అమిత్ షా పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బిజెపి ఇప్పటికే 201 మంది అభ్యర్థులను ప్రకటించిందనీ, మరో 100మంది అభ్యర్థులను త్వరలో ప్రకటించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications