21 నుంచి కాంగ్రెస్ ఎన్నికలు.. గాంధీయేతర వ్యక్తికి అవకాశం.. సందిగ్ధంలో రాహుల్
ఆగస్టు 21వ తేదీ నుంచి కొత్త అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీకి కొంతకాలం నుంచి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే అధ్యక్ష పదవికి పోటీపడే విషయమై రాహుల్ గాంధీ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆ పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

గాంధీయేతర వ్యక్తులు కాకపోతే ప్రతికూల ప్రభావం
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీయే 2019లో కూడా ఓటమి పాలవడంతో అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టాలని నాయకులు, కార్యకర్తలు కోరుతున్నప్పటికీ ఆయన ఇంతవరకు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం గాంధీయేతర వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎంపిక చేయడంపై మేధోమథనం జరుగుతోంది. దీనిపై నేతలెవరూ ఏకాభిప్రాయానికి రావడంలేదు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల్లో మెజారిటీ వర్గం గాంధీ కుటుంబంలోని వ్యక్తులే అధ్యక్ష పదవి చేపట్టాలని కోరుతున్నారు. నిరాకరిస్తే భవిష్యత్తు ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు.

భారత్ జోడో యాత్రపైనే రాహుల్ దృష్టి
2017లో సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు స్వీకరించారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 543 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితమైంది. దీంతో రాహుల్ పార్టీ పగ్గాలను విడిచిపెట్టారు. కొత్త అధ్యక్షుణ్ని ఎన్నుకన్న తర్వాతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఇతర పోస్టులకు ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబర్ 7న ప్రారంభించనున్న భారత్ జోడో యాత్రపైనే రాహుల్ గాంధీ ఎక్కువగా దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయడంద్వారా కాంగ్రెస్ పార్టీని ఉత్తేజితం చేయాలని, నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకురావాలని, పార్టీకి నూతన జవసత్వాలు చేకూర్చడంలో భారత్ జోడో యాత్ర ఎంతో ఉపయోగపడుతుందనేది రాహుల్ భావన.
Recommended Video


మద్దతు పలికిన జీ-23 నేతలు
వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడంతో కాంగ్రెస్ పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు జీ-23 పేరుతో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. గులంనబీ ఆజాద్, శశిథరూర్, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, పృథ్వీరాజ్ చవాన్, రేణుకా చౌదరి తదితరులున్నారు. అయితే ఈ నేతలంతా సోనియా, రాహుల్ ను ఈడీ ప్రశ్నించిన సమయంలో ఈడీపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి అధినాయకత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ తరుణంలో గాంధీయేతర వ్యక్తికి అవకాశం కల్పించాలనుకుంటే ఎవరికి అవకాశం లభిస్తుంది? లేదంటే రాహుల్ గాంధీ పగ్గాలు చేపడతారా? అనే విషయంపై స్పష్టత రావాలంటే 21వరకు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications