బీజేపీ ఎమ్మెల్యేల నుంచి ఆడపడుచులను కాపాడండి: రేప్ లు, మోడీపై రాహుల్ గాంధీ ఫైర్!
బెంగళూరు: బీజేపీ శాసన సభ్యుల నుంచి దేశంలోని ఆడపడుచులకు రక్షించాల్సిన పరిస్థితి దాపురించిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ శాసన సభ్యులు బాలిక మీద అత్యాచారం చేసినా ప్రధాని నరేంద్ర మోడీ నోరుమెదపడం లేదని, దేశంలో ఆడపడుచులకు రక్షణ ఎక్కడ ఉందని రాహుల్ గాంధీ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ శుక్రవారం కలబురిగి, గదగ్ జిల్లాలోని గజేంద్ర గఢ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసగింస్తూ ప్రధాని మోడీ, బీజేపీ మీద విరుచుకుపడ్డారు.
కాశ్మీర్, ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ శాసన సభ్యుడు బాలిక మీద అత్యాచారం చేసి అరెస్టు అయ్యాడని, కాశ్మీర్ లో బీజేపీ నాయకులు చిన్నారి మీద నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారని, కామాంధులకు మంత్రులు మద్దతు ఇచ్చారని, ఇంత జరిగినా కేంద్రం చోద్యం చూస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
భేటీ బాచావో భేటీ పడావో కాదు
ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం భేటీ బాచావో భేటీ పడావో అంటుంటారని, దానిని భేటీ యోంకో బీజేపీ ఎమ్మెల్యే సే బచావో (ఆడపడుచులను బీజేపీ ఎమ్మెల్యేల నుంచి రక్షించండి) అని మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సూచించారు.
మోడీ నోట్లో అన్నీఅపద్దాలు
బసవణ్ణ విగ్రహాలకు పూలమాలలు వేసి నమస్కరించడం కాదని, ఆయన సిద్దాంతాలను మీరు పాటించాలని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్ లో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని అన్నీ అపద్దాలు చెప్పి మోడీ అధికారంలోకి వచ్చారని రాహుల్ గాంధీ విమర్శించారు.
10 రోజుల్లో రుణమాఫీలు
ప్రధాని నరేంద్ర మోడీ దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యాల రుణలు మాఫీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం రైతుల రుణ మాఫీలు చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 10 రోజుల్లో రైతుల రుణాలు అన్నీ రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
గుజరాత్ లో ఏం చేశారు
జైలుకు వెళ్లి వచ్చిన యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మోడీ ప్రకటించారని, ఆయన ప్రజలకు సేవ చేస్తారా, మళ్లీ జైలుకు వెలుతారా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కర్ణాటకలో ఆడపిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నారని, 20 ఏళ్లు గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ఆడపిల్లల కోసం ఏం చేసిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
కర్ణాటకకు వచ్చేది ఎందుకు!
కర్ణాటకకు వస్తున్న ప్రధాని మోడీ ఇతరుల మీద వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, కేంద్రం చేసిన అభివృద్ది పనుల గురించి మాట్లాడటం లేదని రాహుల్ గాంధీ అన్నారు. అసలు కేంద్రం ప్రభుత్వం ఎలాంటి అభివృద్ది పనులు చెయ్యలేదని, అందుకే వాటి గురించి మాట్లాడకుండా ఇతరుల మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ప్రధాని పక్కనే దొంగలు ఉన్నారు
అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన వారు ప్రధాని నరేంద్ర మోడీ పక్కనే వేదిక మీద ఉంటారని, అయితే ఆయన అవినీతి గురించి ప్రజలకు పాఠాలు చెబుతారని రాహుల్ గాంధీ వ్యంగంగా అన్నారు. ప్రజలు ఎవరికి ఓటు వెయ్యాలో వారికి తెలుసని, కర్ణాటకలో మళ్లీ సిద్దరామయ్య ముఖ్యమంత్రి అవుతారని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.