కేజ్రీవాల్పై విరుచుకుపడిన సోనియా అల్లుడు
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. కాలుష్య నివారణకు మీరు తీసుకున్న నిర్ణయాలలో వీఐపీలకు మినహాయింపు ఇవ్వడం ఎంత వరకు న్యాయం అంటూ ప్రశ్నించారు.
కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సరి-భేసి పథకం నుంచి వీఐపీల వాహనాలకు మినహాయింపు ఇవ్వడాన్ని రాబర్ట్ వాద్రా తప్పుపట్టారు. సరి-భేసి పథకంలో వీఐపీల వాహనాలకు మినహాయింపు ఇవ్వడం ప్రజలను వంచించినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రయోజనాల కోసం ఓ చట్టాన్ని అమలు చేసినప్పుడు మనమందరూ పాటించాలని సూచించారు. అంతే కాని వీఐపీలకు మినహాయింపు ఇస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతాయని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
ఢిల్లీలో సరి-భేసి నంబర్లు కలిగిన వాహనాలను రోజుమార్చి రోజు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే రూ. రెండు వేలు జరిమానా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే వీఐపీ వాహనాలకు మాత్రం మినహాయింపు ఇవ్వడంతో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సరి-భేసి పథకంపై మిశ్రమ స్పందన వస్తున్నది. దీనివల్ల ఇబ్బందులు ఎదురౌతాయని రాబర్ట్ వాద్రా అభిప్రాయం వ్యక్తం చేశారు.