అరుణాచల్ప్రదేశ్: బిజెపి-కాంగ్రెస్ రెబల్స్ ప్రభుత్వం?
ఈటానగర్: అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మంత్రివర్గం సిఫార్సు మేరకు అరుణచల్ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. సోమవారం నుంచే రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
కాగా, డిసెంబర్ 16న అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియాకు ‘ఉద్వాసన' పలికేందుకు 21 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. 11 మంది బిజెపి సభ్యులు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో చేతులు కలిపారు. అసెంబ్లీ కాంప్లెక్స్కు స్థానిక పాలనా యంత్రాంగం సీలు వేయడంతో వీరంతా ఉప సభాపతి టి నోర్బు థోంగ్డోక్ అధ్యక్షతన ఒక కమ్యూనిటీ హాల్లో ‘అసెంబ్లీ సమావేశాల'ను నిర్వహించారు.
స్పీకర్కు ‘ఉద్వాసన' పలుకుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఆ మరుసటి రోజు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విపక్ష బిజెపి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ తిరుగుబాటు శాసనసభ్యులతో కలసి స్థానిక హోటల్లో సమావేశమై ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు.
ఆయన స్థానంలో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే కలిఖో పుల్ను కొత్త ‘ముఖ్యమంత్రి'గా ఎన్నుకున్నారు. అయితే గువహటి హైకోర్టు జోక్యం చేసుకొని, తిరుగుబాటు శిబిరం తీసుకున్న నిర్ణయాలను నిలుపుదలలో పెట్టేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర క్యాబినెట్ అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయాన్ని రెబల్స్ వర్గం స్వాగతించింది. మద్దతు లేని నబంటుకి సీఎంగా కొనసాగే అర్హత లేదని పేర్కొంది.
కాగా, 60 మంది ఎమ్మెల్యేలున్న అరుణాచల్ప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, సీఎంగా ఉన్న నబమ్ టుకికి మద్దతుగా 26 మందే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపసభాపతికి అదే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, 11 మంది బిజెపి ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు మద్దతు పలుకుతున్నారు.
ఈ నేపథ్యంలో బిజెపి, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో టి నోర్బు థోంగ్డోక్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెబల్ గ్రూప్ అధికార ప్రతినిధి పసంగ్ దోర్జీ మాట్లాడుతూ.. తమకు 34మంది ఎమ్మెల్యేల మద్దతుందని, బిజెపి, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే, ప్రభుత్వం తమ నేతృత్వంలోనే ఏర్పడుతుందని, బిజెపి కేవలం మద్దతుదారేనని చెప్పారు.
కలిఖో పాల్ తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని దోర్జీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ రెబల్స్తో అరుణాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము కూడా మద్దతు పలుకుతామని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ రెబల్స్ ప్రభుత్వ నేతృత్వంలో అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని చెప్పారు.