బీజేపీ బాటలోనే కాంగ్రెస్-పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు-అయినా కనికరించని జగన్, కేసీఆర్
దేశవ్యాప్తంగా దీపావళి కానుక పేరుతో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. అదే కోవలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించుకుంటే ఆ మేరకు వినియోగదారులకు ఊరట లభిస్తుందని పేర్కొంది. కానీ కేంద్రం సూచనను బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే పాటించాయి. మిగతా పార్టీలు అధికారంలో ఉన్న రాష్టాలు మాత్రం మౌనం వహించాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్టాలు కూడా అదే బాట పట్టాయి.. దీంతో తెలుగు రాష్టాలపై బీజేపీ ఒత్తిడి పెంచుతోంది.
కేంద్రం పెట్రో ఊరట
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాల తర్వాత పెట్రో ధరల్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం... ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసింది. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని కోరింది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తూ వరుసగా నిర్ణయాలు ప్రకటించాయి. దీంతో దీపావళి కానుకగా వినియోగదారులకు డబుల్ ధమాకా లభించింది. కేంద్రం, రాష్టాలు ప్రకటించిన తగ్గింపులతో దీపావళి సందర్భంగా భారీగా చమురు ధరలు దిగొచ్చాయి. దీంతో కొన్నేళ్లుగా వరుసగా పెరుగుతున్న ధరలతో అల్లాడుతున్న వినియోగదారులు ఊరటపొందుతున్నారు.
బీజేపీయేతర రాష్టాలపై ఒత్తిడి
కేంద్రం తీసుకున్న పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం, ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్టాలు తీసుకున్న వ్యాట్ తగ్గింపు నిర్ణయాలతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర పార్టీలపై ఒత్తిడి అమాంతం పెరిగింది. స్ధానికంగా తమ ప్రభుత్వాలు కూడా పెట్రో ధరల్ని తగ్గించాలని వినియోగదారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఆయా ప్రభుత్వాలు ఇరుకునపడుతున్నాయి. ఏపీ వంటి రాష్ట్రాలైతే కేంద్రం ఇచ్చిన తగ్గింపును స్వాగతిస్తూనే తమ రాష్ట్రాల్లో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాయి.
పంజాబ్ తో మొదలుపెట్టిన కాంగ్రెస్
రాష్ట్రాలు వ్యాట్ తగ్గించుకోవాలన్న కేంద్రం సూచనను వెంటనే అమలు చేయని కాంగ్రెస్.. స్ధానికంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తమ పాలిత రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇదే క్రమంలో పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా చమురు ఉత్పత్తులపై వ్యాట్ తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై లీటరుకు రూ.10, డీజిల్ పై లీటకు రూ.5 తగ్గిస్తూ పంజాబ్ లోని చరణ్ జీత్ సింగ్ చన్నీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న పంజాబ్ ప్రభుత్వం ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత తగ్గించుకోగలిగింది.
కనికరించని జగన్, కేసీఆర్
దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గినా, బీజేపీ పాలిత రాష్టాల్లో వ్యాట్ తగ్గినా, ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా అదే బాట పడుతున్నా.. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉండిపోతున్నారు. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించకపోగా.. కనీసం ఆ మాటెత్తేందుకు కూడా సాహసించడం లేదు. పెట్రో ఉత్పత్తులపై హిమాచల్ ప్రదేశ్ తరహాలో కనీసం రెండు రూపాయలు తగ్గించేందుకు సైతం ఇద్దరు ముఖ్యమంత్రులకు మనసు రావడం లేదు. ఇప్పటికే దక్షిణాదిలోనే అత్యధిక పెట్రో ధరలు విధిస్తున్న ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న వైసీపీ సర్కార్ ఏపీలో కనీస ఊరట ఇచ్చేందుకు కూడా ముందుకు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇరు రాష్టాల్లోనూ వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై బీజేపీ ఒత్తిడి పెంచుతోంది.