బిల్డప్ వదిలేసి టీటీడీతో చర్చలు జరపండి, శ్రీవారి ప్రసాదం, 50 ఏళ్ల డీల్, మాజీ మంత్రి !
తిరుమల/బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాష్ట్రంలో అధికారానికి దూరం అయిన బీజేపీ నాయకులు వారి ఉనికిని చాటుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సీటీ రవి కూడా ఆయన శిష్యుడి చేతిలోనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు.
ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా సీటీ. రవికి దూరం కావడంతో ఆయన అనుచరులు హడలిపోయారు. ఇదే సమయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద సీటీ. రవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ)కి కర్ణాటకకు చాలా అనుబంధం ఉందని మాజీ మంత్రి సీటీ, రవి అన్నారు.

టీటీడీకి మన నందిని అతిపెద్ద కస్టమర్ అని, ఇప్పుడు ఆ హోదాను కోల్పోవద్దని సీటీ. రవి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేశారు. కేఎంఎఫ్ అధ్యక్షుడు, సహకార శాఖ మంత్రి, ఎమ్మెల్యే భీమా నాయక్ పరువు, ప్రతిష్ట అంటూ పట్టుకు పోకూడదని, కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డప్ వదిలేసి టీటీడీతో మాట్లాడాలని, టీటీడీతో గౌరవప్రదంగా మాట్లాడి నందిని నెయ్యి సరఫరా అయ్యేలా చూడాలని సీటీ. రవి కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
టీటీడీతో 50 ఏళ్ల వ్యాపార సంబంధాన్ని కొనసాగించాలని, ఆ దిశగా టీటీడీ అధికారులతో చర్చలు జరపాలని, లేదంటే కర్ణాటకలోని పాల ఉత్పత్తిదారులు తీవ్రస్థాయిలో నష్టపోతారని సీటీ. రవి ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని సీటీ. రవి ఆరోపించారు.

అమూల్, నందిని సాంకేతిక సహకారం పొంది కర్ణాటకలో కలిసికట్టుగా పని చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా ఆ రోజు అన్నారని, కర్ణాటకలోని రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో అమిత్ షా ఆ సలహాలు ఇచ్చారని, అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని మాజీ మంత్రి సీటీ. రవి ఆరోపించారు.
ఎవరు ఎప్పుడు పార్టీ అవసరాలకు సరిపోతారో అనే విషయం బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, బీజేపీలో ఎవరు, ఏ పదవి శాశ్వతం కాదని సీటీ. రవి అన్నారు. ఢిల్లీలో తన బాధ్యత ముగిసింది, మీటింగ్ ఉన్నప్పుడే మాత్రమే తాను ఢిల్లీలో ఉంటానని, నాకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్రంలో నేను పని చేస్తానని, ఢిల్లీలో ఇక తనకు పని లేదని, ఢిల్లీలో ఆఫీసు మూసేయడమే మాత్రమే మిగిలి ఉందని సీటీ. రవి అన్నారు. బీజేపీ అధ్యక్ష పదవి కావాలని తాను ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదని కూడా సీటీ. రవి అన్నారు.












Click it and Unblock the Notifications