రైతుల ఆత్మహత్యలు: రాహుల్ గాంధీ పర్యటన
బెంగళూరు: ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు రాహుల్ గాంధీ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, కర్ణాటక మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు.
అనంతరం రాహుల్ గాంధీ, సిద్దరామయ్య, కర్ణాటక ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్, పరమేశ్వర్ ప్రత్యేక హెలికాప్టర్ లో మండ్యకు బయలుదేరి వెళ్లారు. రాహుల్ గాంధీ మండ్య జిల్లా పర్యటన సందర్బంగా స్థానిక రైతులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండ్య లోని విశ్వేశ్వరయ్య విగ్రహం ముందు వందలాధి మంది రైతులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే సందర్బంలో మండ్య జిల్లాలోని అనేక గ్రామాలలో రాహుల్ పర్యటనకు ఎర్పాట్లు చేశారు.
రాహుల్ గాంధీకి మైసూరు పేటతో మంత్రులు, మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యా స్వాగతం పలికారు. మండ్యలోని వీసి ఫార్మా డీన్ చాంబర్ లో మంత్రులు, రైతులతో రాహుల్ గాంధీ ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి ఎర్పాట్లు చేశారు.