వాసన పోలేదు: టిఆర్ఎస్ ప్లీనరీలో కాంగ్రెస్ కార్యకర్తలంటూ షాకిచ్చిన కేశవరావు
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి పార్లమెంటర నేతగా, జనరల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కే కేశవరావు(కేకే) ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారనే భావన కలిగించేలా వ్యవహరించారు. ఖమ్మంలో బుధవారం ప్రారంభమైన టిఆర్ఎస్ 15వ ప్లీనరీలో ఆయన కాంగ్రెస్ పార్టీని తలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
టిఆర్ఎస్ పార్టీలో చేరి చాలా రోజులు అయినప్పటికీ ఆయనలో ఇంకా కాంగ్రెస్ వాసన పోలేదని తేలుస్తోంది. టీఆర్ఎస్ ప్లీనరీలో తొలి పలుకులు పలుకుతూ.. టిఆర్ఎస్కు బదులు ఆయన నోట కాంగ్రెస్ పేరు వచ్చింది.

పార్టీని, ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలదేనని అన్నారు. అయితే వెంటనే తమాయించుకుని తన వ్యాఖ్యలను సరిచేసుకున్నారు కేశవరావు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలదేనన్నారు. అసాధ్యం అనుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాధించుకున్నామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా పాత్ర కీలకమని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి బ్రహ్మాండమైన మద్దతు ఉందని చెప్పారు. తమతో పనిచేసేందుకు అన్ని పార్టీల నేతలు కలిసి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందరం కలిసి బంగారు తెలంగాణను సాధించుకుందామని కేకే చెప్పారు.












Click it and Unblock the Notifications