కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికల వేడి: పార్టీ పగ్గాలు బయటి వ్యక్తికి? సీడబ్ల్యూసీ భేటీ రేపే
న్యూఢిల్లీ: అఖిల భారత జాతీయ కాంగ్రెస్లో అత్యున్నత విభాగం.. శుక్రవారం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ప్రధాన అజెండా.. సంస్థాగత ఎన్నికలే. పార్టీ అధ్యక్ష పదవి మొదలుకుని శాశ్వత ఆహ్వానితుడి వరకూ సీడబ్ల్యూసీలో ప్రక్షాళన చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అనారోగ్య కారణాల వల్ల కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియాగాందీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనుకోవడం, పగ్గాలను చేపట్టడానికి రాహుల్ గాంధీ సుముఖత చూపట్లేని ప్రస్తుత పరిస్థితుల్లో సీడబ్ల్యూసీ భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాంగ్రెస్ సీడబ్ల్యూసీ ఎన్నికలు చివరిసారిగా 1997లో నిర్వహించారు. కిందిస్థాయి నుంచీ కొత్త సభ్యులను వర్కింగ్ కమిటీలోకి తీసుకున్నారు. 2000లో మరోసారి సీడబ్ల్యూసీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. అది పూర్తిగా అధ్యక్ష పదవిని భర్తీ చేయడం కోసమే. 23 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం తొలిసారిగా ఎన్నికలను నిర్వహించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం సన్నాహాలు చేపడుతుండటం ఆసక్తికరంగా మారింది. అధ్యక్ష పదవి తొలిసారిగా గాంధీ కుటుంబం చేజారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
సీడబ్ల్యూసీలో అత్యున్నత హోదాలో 23 మంది నేతలు ఉన్నారు. వారిలో 12 మందిని సంస్థాగత ఎన్నికల్లో గెలిచిన వారు. వారిలో ఆరు మంది సాధారణ కేటగిరికి చెందిన నేతలు. మిగిలిన ఆరుమందిలో నలుగురు మహిళా నేతలు ఉన్నారు. రెండు సీట్లల్లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ నేతలను తీసుకున్నారు. మిగిలిన 11 మంది.. పార్టీ అధినేత లేదా అధినేత్రి నామినేట్ చేసిన వారు. మొత్తం 1500 మందికి సీడబ్ల్యూసీలో సభ్యత్వం ఉంది. వారంతా సంస్థాగత ఎన్నికల్లో పాల్గొంటారు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా తేలాల్సి ఉంది. రేపటి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయాన్ని తీసుకోవచ్చని తెలుస్తోంది.
సీడబ్ల్యూసీని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రతి స్థాయిలోనూ కొత్త నేతలను ఎన్నుకోవాల్సి ఉందంటూ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సీడబ్ల్యూసీని ప్రక్షాళన చేస్తేనే.. .పార్టీ మనుగడ కొనసాగుతుందంటూ ఆయన ఇదివరకు ఘాటుగా స్పందించారు. మరో సీనియర్ నేత కపిల్ సిబల్ కూడా గులాం నబీ ఆజాద్తో గళం కలిపారు. ఈ పరిణామాల మధ్య సీడబ్ల్యూసీ భేటీ కాబోతోండటం చర్చనీయాంశమౌతోంది.