మేం అధికారంలోకి వస్తే ఒకే జీఎస్టీ, అది మా ఆలోచన: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే శ్లాబు జీఎస్టీని అమలు చేస్తామని, 28 శాతాన్ని రద్దు చేస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిన్నదని చెప్పారు.
సమాజంలో లింగబేధం, పేదలు, శ్రీమంతులు అనే హెచ్చుతగ్గులు అనాదిగా వస్తున్నాయని, భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని మండిపడ్డారు. ఆయన కర్నాటక పర్యటనలో భాగంగా శనివారం మాట్లాడారు.
తొలుత చామరాజ్ నగర్లో చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ర్యాలీలో మాట్లాడారు. అంతకుముందు మైసూర్ మహారాణి కళాశాలలోను మాట్లాడారు.
స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారి వివరాలు కేంద్రం వద్ద ఉన్నప్పటికీ వాటిని బయటపెట్టడం లేదన్నారు. వివిధ రకాల జీఎస్టీ ఉంటే అవినీతికి ఆస్కారం ఉంటుందన్నారు. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకే శ్లాబు తీసుకు వస్తుందన్నారు.
జీఎస్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని, సింగపూర్లో ఒకే జీఎస్టీ ఉందని, కానీ ఇక్కడ బీజేపీ ఐదు రకాలుగా తీసుకు వచ్చిందన్నారు. 28 శాతం జీఎస్టీకి తాము వ్యతిరేకమన్నారు. ప్రచారంలో భాగంగా జేడీఎస్ పైన రాహుల్ నిప్పులు చెరిగారు. జేడీఎస్ బీజేపీ తొత్తు అని, జేడీఎస్ అంటే జనతా దళ్ సంఘ్ పరివార్ అన్నారు.