వ్యభిచారం తప్పు కాదు, అరెస్ట్లు వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: వ్యభిచారం తప్పుకాదని, సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సంచలన సిఫార్సులను చేయనుంది. ఈ మేరకు సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడే దిశగా దేశ అత్యున్నత న్యాయస్థానం 2011లో నియమించిన కమిటీ తన నివేదికను వచ్చే నెలలో కోర్టు ముందు నివేదించనుంది.
పూట గడవక, పొట్టకూటి కోసం వ్యభిచారాన్ని వృత్తిగా స్వీకరించడం చట్ట వ్యతిరేకం ఏమీ కాదని, అయితే, వ్యభిచార గృహం నిర్వహించడం మాత్రం తప్పేనని ఈ కమిటీ పలు సిఫార్సులను చేయనుంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వృత్తిలో ఉన్నవారిని చట్ట వ్యతిరేకులుగా భావిస్తున్నారంటూ అందులో పేర్కొంది.
వ్యభిచార వృత్తిలో ఉన్న వారిని పోలీసులు కూడా వేధించరాదని ఈ కమిటీలోని కొన్ని సిఫార్సులను 'హిందుస్థాన్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసిన పక్షంలో, ఆ వృత్తిలో ఉన్న వారిని అరెస్ట్ చేయరాదని, వారిపై జరిమానాలు వద్దని కూడా కమిటీ సూచించనున్నట్టు తెలుస్తోంది.
ఈ తరహా కేసుల్లో 1956 నాటి ఐటీపీఏ (ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టంలోని సెక్షన్ 8ను పోలీసులు అతిక్రమిస్తున్నట్టు తెలుస్తోందని పేర్కొంది. ఐటీపీఏ చట్టం ప్రకారం, వ్యభిచార వృత్తిలో ఉన్న సెక్స్ వర్కర్లు బహిరంగంగా విటులను ఆకర్షించకూడదు.
ఇందుకు గాను ఆరు నెలల జైలు శిక్ష, రూ. 500 వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రదీప్ ఘోష్ అధ్యక్షతన కమిటీ ఏర్పడగా, వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పలు సిఫార్సులు ఉన్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఎవరిపైనైనా సెక్స్ వర్కర్లు కేసు పెడితే, దాన్ని కూడా ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కమిటీ సిఫార్సు చేయనుంది. ఇక వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న వారు పట్టుబడితే, పదేళ్ల వరకూ జైలుశిక్ష విధించేలా చట్టాన్ని సవరించాలని కమిటీ సూచించింది.
భారత్లో పేదరికం కారణంగా అధికారిక అంచనాల ప్రకారం సుమారు 12 లక్షల మంది ఈ వ్యభిచార వృత్తిలో ఉన్నారు.