నా భర్త నన్ను రేప్ చేశాడు: ఊచకోత కేసు దోషి భార్య
అహ్మదాబాద్: తన భర్త తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు అత్తింటివారు దారుణంగా తనను కొట్టి ఇంట్లోంచి గెంటేశారని జైలులో శిక్ష అనుభవిస్తున్న 2002 నరోడా పాటియా నరమేథం కేసులో దోషి సురేష్ డేడవాలా అలియాస్ రిచర్డ్స్ భార్య ఆరోపించింది. ఈ ఆరోపణతో ఆమె కోర్టును ఆశ్రయించింది.
తన అత్తింటివారి నుంచి తనకు ప్రాణహాని ఉందని అంటూ తనకు విడాకులు ఇప్పించి భద్రత కల్పించాలని ఆమె కోర్టును కోరింది. 2002 గుజరాత్ అల్లర్ల సందర్బంగా జరిగిన నరోడా పాటియా నరమేథం కేసులో దోషిగా తేలిన దేడవాలాకు మూడేళ్ల క్రితం కోర్టు 31 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
ఇరవై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం పెరోల్పై బయటకు వచ్చినప్పుడు దేడవాలా తనపై అత్యాచారం చేశాడని, తనకు విడాకులు మంజూరు చేసి, రక్షణ కల్పించాలని అతని భార్య ఈ నెల 1వ తేదీన అహ్మదాబాద్ సెషన్స్ కోర్టును ఆశ్రయించింది.
దేడవాలాను పెళ్లి చేసుకున్న తర్వాత రెండు దశాబ్దాల పాటు పుట్టింటికి దూరంగా ఉన్న తాను ప్రాణభయంతో పుట్టింటికి వెళ్లినట్లు అతని భార్య చెప్పింది. ఈ కేసును కోర్టు విచారణకు తీసుకుంది. నరోడా పాటియా నరమేథం కేసులో సామూహిక అత్యాచారం కేసులో 32 మంది నిందితుల్లో దండోవాలాను మాత్రమే కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేరమేథంలో 97 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నారు.