షాక్: గస్తీ వాహనంలో మహిళను రేప్ చేసిన పోలీస్ అధికారి
ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని నమ్మించిన పోలీసు అధికారి ఉమేష్ గస్తీ తిరుగుతున్న వాహనంలోనే మానసిక వికలాంగురాలి (31)పై అత్యాచారం చేసిన దారుణ సంఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కేంద్రంలో జరిగింది.
బెంగళూరు: ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని నమ్మించిన పోలీసు అధికారి గస్తీ తిరుగుతున్న వాహనంలోనే మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసిన దారుణ సంఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కేంద్రంలో జరిగింది.
రక్షకులే కీచకులు కావడంతో బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. తుమకూరులోని అంతరసనహళ్ళిలో బాధితురాలు (31) తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నది. ఒక చిన్నవిషయంపై కుటుంబ సభ్యులతో అలిగిన ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
శనివారం రాత్రి రహదారి పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఆమె పక్కన పోలీసు గస్తీ వాహనం వచ్చి ఆగింది. అనంతరం ఎక్కడికి వెలుతున్నావంటూ తుమకూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఉమేష్, గస్తీ వాహనం డ్రైవర్ (పోలీసు) ఆమెను అడిగారు.
ఇంట్లో నుంచి అలిగి వచ్చేశానని బాధితురాలు చెప్పింది. ఇలా చెయ్యకూడదని, తాము ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి ఆమెను వాహనంలో ఎక్కించుకున్నారు. దారిలో గస్తీ తిరుగుతున్న వాహనంలోనే ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. తరువాత బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఏఎస్ఐ ఉమేష్, గస్తీ వాహనం డ్రైవర్ మీద కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ఏఎస్ఐ ఉమేష్ ఒక్కడే బాధితురాలిపై అత్యాచారం చేశాడని గుర్తించామని తుమకూరు జిల్లా ఎస్పీ ఇషా పంత్ తెలిపారు.
అయితే గస్తీ వాహనం డ్రైవర్ అత్యాచారం చెయ్యకున్నా అతని మీద కేసు నమోదు చేశామని ఎస్పీ ఇషా పంత్ చెప్పారు. అత్యాచారం చెయ్యడానికి ఉపయోగించిన జీపు పోలీసు శాఖది కాదని, అది ప్రైవేట్ వాహనం అని పోలీసు అధికారులు చేతులు దులుపుకున్నారు.