300 కేసుల క్రిమినల్: పోలీసులను బుక్ చేశాడు
ఆగ్రా: పోలీసులకు బూట్లు బహుమతిగా ఇచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు ఒక క్రిమినల్. అతనికి సహకరించిన పోలీసుల అసలు బండారం బయటపడింది. షోరూం యజమాని ఇచ్చిన సమాచారంతో మీడియా రావడంతో పోలీసుల అసలు రంగు వెలుగు చూసింది.
తీహార్ జైలులో మనోజ్ బక్కర్ అనే క్రిమినల్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతని మీద 10 రాష్ట్రాలలో 300కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇతను కరుడుకట్టిన రాక్షసుడు, హంతకుడు, పెద్ద గజదొంగ. 2010వ సంవత్సరంలో తన గర్ల్ ఫ్రెండ్ భర్త కుటుంబాన్ని అంతం చేశాడు. .
ఖరీదైన కార్లు చోరీ చేస్తు విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అయితే పోలీసులు కష్టపడి ఇతనిని 2012లో అరెస్టు చేశారు. మనోజ్ తీహార్ జైలుకు వెళ్లిన తరువాత మూడు సార్లు తప్పించుకున్నాడు. జైలులో ఉన్నా ఇతని మీద పోలీసులు గట్టి నిఘా వేశారు.
ఒక కేసుకు సంబంధించి మనోజ్ ను ఇటివల ఆగ్రా కోర్టుకు తీసుకు వెళ్లారు. ఉదయం 10.30 గంటలకు కోర్టు విచారణ పూర్తి అయ్యింది. అనంతరం మనోజ్ ను పోలీసులు తీహార్ జైలుకు తీసుకు వెళ్లడానికి బయలుదేరారు. అయితే మార్గం మద్యలో అతను పోలీసులకు ఏమి మాయ చేశాడో తెలియదు.
అతని చేతులకు సంకెళ్లు ఉన్నాయి. పోలీసు వాహనం దిగి పరుగున ఒక షూ షోరూంలోకి వెళ్లాడు. దర్జాగా సోఫాలో కుర్చున్నాడు. అతని వెంటన సాయుధ పోలీసులు వెళ్లారు. షో రూం యజమాని సంకెళ్లు వేసుకున్న మనోజ్ బక్కర్ వాలను చూశాడు.
మనోజ్ షో రూంలో పని చేస్తున్న సేల్స్ మెన్ ని పిలిచాడు. పోలీసులకు ఖరీదైన షూలు చూపించాలని చెప్పాడు. షో రూం యజమానికి అనుమానం వచ్చి అతనికి తెలిసిన మీడియా వారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. మీడియా సిబ్బంది కెమెరాలు తీసుకుని షో రూం దగ్గరకు వెళ్లారు.
విషయం గుర్తించిన పోలీసులు చిన్నగా అక్కడి నుండి జారుకున్నారు. తీహార్ జైలు పోలీసులు ఆరుగురు, ఆగ్రా పోలీసులు ఆరుగురు మనోజ్ కు గార్డులుగా నియమితులయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఖరీదైన బూట్లు కోసం ఆశపడిన పోలీసులను సస్పెండ్ చేస్తు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
పోలీసులనే బురిడి కొట్టించడానికి ప్రయత్నించిన మనోజ్ ను పోలీసు అధికారులు తీహార్ జైలుకు తరలించారు. తన ప్లాన్ మిస్ కావడానికి షో రూం యజమాని కారణం అంటు మనోజ్ పగతో రగిలిపోతున్నాడు.