సుప్రీంకోర్టులో పిల్- కోరమాండల్ ప్రమాదం వెనుక అసలు నిజాలు బయటికి రావాలి
భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్ప్రెస్కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. 288కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమౌతోంది. వారంతా బాలాసోర్ సహా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.
హౌరా- చెన్నై మార్గంలో పట్టాల పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పట్టాల పునరుద్ధరణ, రెస్క్యూ కార్యక్రమాలను పర్యవేక్షిస్తోన్నారు. ఈ మధ్యాహ్నం 12:05 నిమిషాలకు డౌన్ మెయిన్ లైన్ను పునరుద్ధరించారు. ఈ మార్గంలో ఈ సాయంత్రానికి రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

కాగా- కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. సీనియర్ అడ్వొకేట్ విశాల్ తివారీ దీన్ని దాఖలు చేశారు. ఈ ప్రమాదం వెనుక గల అసలు కారణాలు, నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదానికి దారి తీసిన కారణాలపై నిపుణులతో కూడిన అత్యున్నత కమిటీని ఏర్పాటు చేయాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
రైల్వే నెట్వర్క్ను అత్యంత సురక్షితంగా మార్చడానికి, కోరమాండల్ ఎక్స్ప్రెస్ వంటి విషాదకరమైన రైలు ప్రమాదాలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా ఉండటానికి, వందలాది మంది ప్రయాణికుల జీవితాలను రక్షించడానికి.. న్యాయపరమైన జోక్యం తప్పనిసరిగా అవసరమైందని విశాల్ తివారి అన్నారు. రైల్వే వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న భద్రత ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది సమీక్షించడానికి సమగ్ర దర్యాప్తు అవసరమని చెప్పారు.
రైల్వే భద్రత వ్యవస్థ సామర్థ్యాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కోరమాండల్ ఎక్స్ప్రెస్ గుర్తు చేసిందని విశాల్ తివారీ అన్నారు. దీనికోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, సాంకేతిక నిపుణులతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చారాయన ఈ పిల్లో. రెండు నెలల వ్యవధిలో ఈ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications