మళ్ళీ 20 వేలను దాటిన కరోనా కేసులు; 23,529 కొత్త కేసులు, 311 మరణాలు.. ఆ రాష్ట్రమే కారణం
భారతదేశంలో మరోమారు 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా 20 వేల దిగువకు నమోదైన కొత్త కేసులు ఈరోజు మళ్ళీ 20000 దాటి నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రం భారీ సంఖ్యలో కొత్త కేసుల నమోదుకు కారణంగా మారింది. భారత దేశంలో కరోనా వైరస్ కేసులలో గత రోజు గణాంకాల కంటే తాజా కేసుల పెరుగుదల దాదాపు 25 శాతం పెరగడం కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 23,529 కేసులు నమోదయ్యాయి.ఇదిలా ఉంటే కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదు కావడం భారతదేశానికి ఊరట కలిగిస్తున్న అంశం.

నిన్న 311 మరణాలు, తగ్గుతున్న యాక్టివ్ కేసులు
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో అందుబాటులో ఉన్న అప్డేట్ డేటా ప్రకారం, యాక్టివ్ కేస్లోడ్ మొత్తం కేసులలో ఒక శాతం కంటే తక్కువ 0.82 శాతంగా ఉంది. యాక్టివ్ కేస్లోడ్ ఇప్పుడు 2, 77,020 గా నమోదయింది. ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ శాతం 97.85 గా ఉంది. నిన్న ఒక్క రోజులో 28,718 మంది రోగులు అధికారికంగా కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్నారని ప్రకటించారు. అదే సమయంలో 311 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,48,062 కి చేరుకుంది.

దేశంలో వ్యాకినేషన్ డ్రైవ్ ఇలా
గత 24 గంటల్లో కోవిడ్ -19 కి వ్యతిరేకంగా 65,34,306 డోసుల టీకాలు వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో డ్రైవ్ ప్రారంభించిన తర్వాత చేసిన మొత్తం టీకాల సంఖ్య 88,34,70,578 కి చేరుకుంది.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) బుధవారం 15,06,254 నమూనాలను కరోనా మహమ్మారి నిర్ధారణ కోసం పరీక్షించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 56,89,56,439 గా ఉంది.

కేరళలోనే సగానికి పైగా కొత్త కేసులు, మరణాలు
కొద్దిపాటి హెచ్చుతగ్గులతో ప్రస్తుతం భారత దేశంలో కరోనా కేసుల నమోదు కనిపిస్తుంది. ఇక రోజువారి అత్యధిక కేసులు నమోదు చేస్తున్న కేరళ రాష్ట్రంలో కొత్తగా 12161 కేసులు నమోదయ్యాయి 155 మంది కరోనాతో మరణించారు. కేరళ రాష్ట్రం ఒక్కటే దేశంలో సగానికి పైగా కేసులను నిత్యం నమోదు చేస్తుంది. ఇక తాజాగా దేశంలో సగానికిపైగా మరణాలను కూడా కేరళ రాష్ట్ర నమోదు చేసింది. ఇక కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 3187 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 49 మంది మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో కేసుల తీరు ఇలా
తమిళనాడు రాష్ట్రంలో 1,624 కొత్త కేసులు నమోదు కాగా 24 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 1084 కరోనా కేసులు నమోదు కాగా, 13 మంది మరణించారు. ఇక ఈశాన్య రాష్ట్రాలలో అత్యధికంగా కేసులు నమోదు చేస్తున్న మిజోరాం రాష్ట్రంలో 1380 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. ఇక ఒడిశాలో కొత్త కేసులు 565 నమోదుకాగా, ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో 748 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 14 మంది మరణించారు.అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఆరు కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. ఇక కర్ణాటక రాష్ట్రంలో 539 కరోనా కేసులు నమోదు కాగా 15 మంది మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో 41 కరోనా కేసులు నమోదు కాగా, జీరో మరణాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications