భారత్ లో గణనీయంగా తగ్గుతున్న కరోనా కేసులు: తాజాగా 25 వేల దిగువకు కొత్త కేసులు
భారతదేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారతదేశంలో 24,021 కరోనావైరస్ కొత్త కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పుడు 99,56,557 కు చేరుకుంది. తాజాగా పెరుగుతున్న కేసులను బట్టి మరో రెండు రోజుల్లో కోటి దాటే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.
ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 3,22,366
ఉదయం 8 గంటలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం క్రియాశీల కేసుల సంఖ్య 3,22,366 కు తగ్గింది. ఇప్పటివరకు కరోనా నుండి 94,89,740 మంది బాధితులు కోలుకుని బయటపడ్డారు. వివిధ హాస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక రోజు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 33,291 కి చేరుకుంది. కరోనా కారణంగా దేశంలో తాజాగా 355 మరణాలు నమోదయ్యాయి, దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1,44,451 కు చేరుకుంది.
గత 17 రోజుల నుండి రోజువారీ 40,000 కన్నా తక్కువ
కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు దేశంలో నమోదైన మొత్తం కేసులలో 3.34 శాతానికి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 17 రోజుల నుండి భారతదేశంలో రోజువారీ 40,000 కన్నా తక్కువ కేసులను నమోదు చేసింది అని మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. గత ఏడు రోజులలో భారతదేశంలో 10 లక్షల మంది జనాభాకు కొత్త కేసుల సంఖ్య - 147 కేసులే నమోదయినట్లుగా అంచనా. ప్రపంచంలో నమోదవుతున్న మొత్తం కేసులతో చూస్తే ఇది చాలా తక్కువగా ఉంది.
18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీగా రికవరీ రేటు
కొత్త మరణాలలో పది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 75.19 శాతం ఉన్నాయి. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు బాగా కనిపిస్తుంది . భారత కరోనా కేసుల సంఖ్య ఆగస్టు 7 న 20 లక్షలు, ఆగస్టు 23 న 30 లక్షలు, సెప్టెంబర్ 5 న 40 లక్షలు దాటింది. ఇది సెప్టెంబర్ 16 న 50 లక్షలు, సెప్టెంబర్ 28 న 60 లక్షలు, అక్టోబర్ 28 న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29 న 80 లక్షలు, నవంబర్ 20 న 90 లక్షలకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, డిసెంబర్ 15 వరకు 15,66,46,280 కరోనా టెస్టులను నిర్వహించినట్లుగా తెలుస్తుంది.