భారత్ లో కరోనా కేసుల తగ్గుదల .. 9 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు !!
భారతదేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గుతుండటం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం క్రియాశీలక కేసుల సంఖ్య కూడా 9 లక్షల దిగువకు చేరుకుంది. ఇక తాజాగా భారతదేశం బుధవారం 62,224 కరోనావైరస్ కేసులను , 2,542 మరణాలను నమోదు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.దీంతో ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,96,33,105 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,79,573 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రస్తుతం భారత్లో రోజువారి కేసులు లక్ష కంటే తక్కువగా నమోదవుతున్నాయి. కేసుల తగ్గుదల గత తొమ్మిది రోజులుగా కొనసాగుతోంది. మంగళవారం రోజు 60,471 మంది కరోనా బారిన పడగా, ఈరోజు ఆ సంఖ్య కాస్త పెరిగింది.గత 24 గంటల్లో 1,07,600 మందికి పైగా ప్రజలు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీలు 2,83,88,100 కు చేరుకున్నాయి. క్రియాశీల కేసులు 8,65,432 కు క్షీణించాయి . ఇప్పుడు ఉన్న మొత్తం కేసులలో 3.09 శాతం క్రియాశీల కేసులు ఉన్నాయి.

కరోనా మహమ్మారి నిర్ధారించడానికి ఇప్పటివరకు మొత్తం 38,33,06,971 నమూనాలను పరీక్షించామని, గత 24 గంటల్లో 19,30,987 పరీక్షలు చేశామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) బుధవారం తెలిపింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు (యుటిలు) విధించిన లాక్డౌన్ ఫలితంగా భారతదేశంలో రోజువారీ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. ఈ ధోరణి కారణంగా, ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించే ఉద్దేశంతో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలు తమ అన్లాకింగ్ ప్రక్రియను ప్రారంభించాయి.












Click it and Unblock the Notifications