భారత్ పై మళ్ళీ కరోనా పంజా; తాజాగా 13,154 కొత్తకేసులు; 961 ఒమిక్రాన్ కేసులు
కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. వివిధ దేశాలలో ఇప్పటికే కరోనా కేసులు విజృంభణ కొనసాగుతుంది. లక్షల్లో నమోదవుతున్న కేసులతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వరుసగా రెండో రోజు పది లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికా, ఫ్రాన్స్, రష్యా లో, కరోనా మహమ్మారి వణుకు పుట్టిస్తోంది. ఒకపక్క డెల్టా వేరియంట్, మరోపక్క ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతున్నాయి. ఇటు భారతదేశంలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

భారత్ లో కరోనా పంజా .. థర్డ్ వేవ్ సంకేతం?
భారత దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలవరానికి గురి చేస్తున్న తరుణంలో కరోనా కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. కొద్ది రోజులుగా భారత్ లో థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. వారి మాటలను నిజం చేస్తూ భారత్ లో కరోనా కేసులు ఒక్కసారిగా ఊహించని విధంగా పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా పదివేలకు దిగువనే నమోదవుతున్న కేసులు ఒక్కసారిగా పెరగడం, కరోనా మహమ్మారి విజృంభణకు సంకేతంగా కనిపిస్తుంది.

తాజాగా భారతదేశంలో 13154 మందికి కరోనా,961 ఒమిక్రాన్ కేసులు
గత 24 గంటల్లో భారతదేశంలో 13154 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొన్న నమోదైన కేసులు కంటే నిన్న ఒక్కరోజే 44 శాతం అదనంగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి గత 24 గంటల్లో 268 మంది మృత్యువాత పడినట్లుగా పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,80,860 కు చేరుకుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా శరవేగంగా వ్యాప్తిచెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు భారత దేశంలో 961 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం
అనేక రాష్ట్రాలు బుధవారం రోజువారీ కోవిడ్ -19 కేసులలో విపరీతమైన పెరుగుదలను చూశాయి. భారత్ లో మళ్ళీ కరోనా కేసుల్లో మహారాష్ట్ర టాప్ గా నిలిచింది. ఒక్క మహారాష్ట్రలోనే గత 24 గంటల్లో 3900 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 2,846 కేసులు నమోదయ్యాయి. తాజా కోవిడ్-19 కేసులతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 3,48,22,040కి చేరింది. భారత దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 82,402 గా ఉన్నట్టు సమాచారం.

ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగటం, క్రియాశీల కేసులపై ప్రభావం
భారతదేశంలో బుధవారం నాడు 11 లక్షల 99 వేల 252 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఒక్కసారిగా బాధితుల సంఖ్య భారీగా పెరగడంతో క్రియాశీల కేసుల పైన కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది.గత 24 గంటల్లో 7486 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇంతలో, యుఎస్లో కోవిడ్ -19 యొక్క కొత్త కేసులు రికార్డు స్థాయిలో రోజుకు సగటున 2,65,000 కంటే ఎక్కువ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినుండి 3.42 కోట్లమంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా నూట నలభై మూడు కోట్లమందికి ఇప్పటివరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.












Click it and Unblock the Notifications