పంజా విసురుతున్న కరోనా .. 25వేలకు చేరువగా కేసులతో ఇండియాలో మరోమారు టెన్షన్
దేశంలో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. గత 24 గంటల్లో భారత్ 24,882 తాజా కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. ఈ ఏడాది ఆరంభం నుండి ఇదే కరోనా కేసులు అత్యధిక జంప్ అని తెలుస్తుంది . ఇప్పటివరకు ఇండియా 1.13 కోట్ల కేసులను నమోదు చేసింది. నిన్న 23,285 కేసులు నమోదు చేసిన ఇండియాలో, నేడు ఒక రోజు కరోనా కేసుల సంఖ్య నిన్నటి దానికంటే కంటే దాదాపు ఏడు శాతం ఎక్కువగా నమోదయింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? వ్యాక్సినేషన్ కు ముందు, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !!
కోటి 13 లక్షలకు పైగా ఇప్పటివరకు ఇండియాలో మొత్తం కేసులు
భారతదేశంలో కరోనా మహమ్మారి ఏడాది క్రితం వ్యాప్తి చెందినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 1,13,33,728 కేసులను నమోదు చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి కారణంగా 140 మరణాలు సంభవించినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,58,446 కు చేరుకుంది. రికవరీలు 1.09 కోట్లు దాటాయి. భారతదేశంలో మొత్తం కోవిడ్-19 యాక్టివ్ కాసేలోడ్ 1,97,237 కు చేరుకుంది. ఇది భారతదేశం యొక్క మొత్తం ఇన్ఫెక్షన్లలో 1.74 శాతంగా ఉంది .
గత 24 గంటల్లో భారీగా పెరిగిన కేసులు
ఇదిలా ఉంటే 25 వేలకు చేరువగా కరోనా కేసులు పెరగడం మరోమారు ఇండియాలో ఆందోళన కలిగిస్తుంది. మళ్లీ కరోనా మహమ్మారి తిరగబెట్టిందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 8.40 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 25 వేలకు చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2, 02, 022 యాక్టివ్ కేసులు ఉండగా, కొద్ది రోజులుగా యాక్టివ్ కేసులు, రికవరీ ల కంటే ఎక్కువగా నమోదు కావడం భారతదేశంలో ఆందోళన కలిగిస్తుంది.
మహారాష్ట్రలో తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కరోనా రక్కసి
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతోంది . అక్కడ రోజు వారి కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్న పరిస్థితి మహారాష్ట్రలో కరోనా అదుపులో లేదన్న భావన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసులలో దాదాపు 64 శాతం కేవలం మహారాష్ట్రలోని బయటపడటం గమనించాల్సిన విషయం . శుక్రవారం నాడు మహారాష్ట్రలో 15, 817 మంది తాజాగా కరోనా మహమ్మారి బారినపడ్డారు. గత ఐదు నెలల కాలంలో మహారాష్ట్రలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాలేదు.
ఇండియాలో టాప్ 5 రాష్ట్రాలు ఇవే
మళ్లీ తాజాగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతున్న క్రమంలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో కూడా లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్ని ప్రాంతాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారు. కరోనా కట్టడి కోసం మహా ప్రభుత్వం విఫలయత్నం చేస్తోంది.
మహారాష్ట్ర , కేరళ , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు రాష్ట్రాలు ప్రస్తుతం కరోనా కేసుల్లో టాప్ 5 లో ఉన్నాయి.