ఇండియాలో కరోనా సామాజిక వ్యాప్తి ..ప్రభుత్వం చెప్తుందేంటి? నిపుణులు ఏమంటున్నారు?
భారతదేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారతదేశం 3లక్షల కరోనా వైరస్ కేసులకు చేరువగా ఉంది.ఇక ఈ సమయంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి లేదని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెప్పడం వృధా ప్రయాస అని, భారతదేశంలో కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతుందని ఎపిడెమియాలజిస్ట్ లు,ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మూడు లక్షలకు చేరువలో ఇండియాలో కరోనా కేసులు .. సామాజిక వ్యాప్తి ఉందన్న నిపుణులు
మార్చి 25వ తేదీన కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా లాక్ డౌన్ విధించడం మొదలుపెట్టిన నాటినుండి నేటి వరకు మూడులక్షలకు దగ్గరగా భారతదేశంలో కేసులు చేరుకున్నాయి అంటే సామాజిక వ్యాప్తి జరుగుతుంది అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఏప్రిల్ నెల నుండే సామాజిక వ్యక్తి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రభుత్వం దీనిని బహిర్గతం చేయకూడదని భావించినట్లుగా ఉందని వారంటున్నారు. కరోనా టెస్ట్ ల విషయంలో కూడా పరిమితంగా పరీక్షలు చేస్తున్ననేపథ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం కరోనా వ్యాప్తి నియంత్రించడానికి దీర్ఘకాలిక లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనావ్యాప్తి శరవేగంగా జరుగుతోంది.
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతుంది .. అంగీకరించటం తప్పు కాదు : ఎపిడెమియాలజిస్ట్ ములీల్
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతుందని, ఇక దానిని నిర్మూలించడానికి, నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక సామాజిక వ్యాప్తి దశలో కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా కష్టం అవుతుందని వారంటున్నారు. సామాజిక వ్యాప్తి ఉంది అన్న విషయాన్ని అంగీకరించటంతో ఎలాంటి తప్పు లేదని తాము గతంలో కూడా చెప్పామని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్, ఎపిడెమియాలజీ మరియు నిఘాపై ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన ఉప సంఘం సభ్యుడు జయ ప్రకాష్ ములీల్ పేర్కొన్నారు.
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదనటం ప్రభుత్వ మొండితనం : నేషనల్ హెల్త్ సిస్టం రిసోర్స్ సెంటర్ మాజీ డైరెక్టర్ సుందర్ రామన్
నేషనల్ హెల్త్ సిస్టం రిసోర్స్ సెంటర్ మాజీ డైరెక్టర్ సుందర్ రామన్ కూడా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉంది అన్న విషయాన్ని నిరాకరించటం ప్రభుత్వం యొక్క మొండితనాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉంది అన్న విషయాన్ని తిరస్కరించడం ద్వారా కంటోన్మెంట్ జోన్ లు , హాట్ స్పాట్ లను మినహాయించి రోగ లక్షణాలు ఉన్న వ్యక్తులకు పరీక్షలు చేయకుండా పరిమితం చేస్తున్నారని, తద్వారా భవిష్యత్తులో మరింత దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.ఇప్పటివరకు చేస్తున్న పరీక్షలన్నీ రోగ లక్షణాలు ఉన్న వారి పైనే చేయడం గమనార్హం.
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతుందని తేల్చిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్
ఇక ప్రభుత్వాలు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ను తిరస్కరించినప్పటికీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటినల్ నిఘా ప్రకారం ఏప్రిల్ నుండి శ్వాసకోస అనారోగ్య రోగులపై జరిపిన సర్వేలో పలు కీలక విషయాలను వెలువరించింది. 5911 మంది శ్వాసకోస అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల్లో 104 మంది కి పాజిటివ్ పరీక్షలు చేయగా వారిలో 40 మందికి ఎటువంటి విదేశీయాన చరిత్ర కాని, కరోనా రోగి కాంటాక్ట్ తో సంబంధం కానీ లేకుండా కరోనా పాజిటివ్ గా వచ్చినట్లుగా తేలింది. ఇక అంతే కాకుండా కరోనా హాట్ స్పాట్ గా ఉన్న ప్రాంతాలలో 15 నుండి 30 శాతం జనాభాలో కరోనా ప్రబలంగా ఉంది అని తేలింది.
కరోనా సామాజిక వ్యాప్తి ఉంది .. అప్రమత్తత అవసరం అంటున్న నిపుణులు
ఏది ఏమైనా కరోనా తీవ్రమవుతున్న నేటి తరుణంలో ప్రభుత్వాలు ఇంకా సామాజిక వ్యాప్తి లేదు అనే విషయాన్ని పదే పదే చెబుతూ ప్రజలను మభ్య పెట్టే బదులు, నిజాన్ని నిర్భయంగా చెప్పి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు మరింతగా పెంచాల్సిన అవసరముందని ఎపిడెమియాలజిస్ట్ లు పేర్కొంటున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వాలదే బాధ్యత అన్నట్టు వ్యవహరించకుండా తమ వంతు రక్షణా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.