కొంప ముంచుతున్న కరోనా ... భారత్ లో 40 వేలకు చేరువగా కేసులు.. మోగుతున్న డేంజర్ బెల్స్
భారతదేశంలో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో భారతదేశంలో ఆందోళన మొదలైంది. విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి భారతదేశానికి మరోమారు సవాల్ గా మారింది. గత 24 గంటల్లో భారతదేశంలో 40 వేలకు చేరువగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.

గత 24 గంటల్లో 39,726 కరోనా కొత్త కేసులు, 154 మరణాలు
గత 24 గంటల్లో 39,726 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి . దీంతో దేశం మొత్తం 1.15 కోట్లకు పైగా కరోనా కేసులు చేరుకున్నాయి. ఇందులో 2.71 లక్షలకు పైగా కేసులు యాక్టివ్గా ఉండగా, 1.10 కోట్లకు పైగా ప్రజలు కరోనా నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 154 మరణాలు సంభవించాయి, దీంతో మరణాల సంఖ్య ఇప్పుడు 1.59 లక్షలకు పైగా ఉంది. ఇప్పటివరకు 3.39 కోట్లకు పైగా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది.

ఒక్క మహారాష్ట్రలోనే గత 24 గంటల్లో 25,833 కొత్త కేసులు
ఇండియాలో ముఖ్యంగా మహారాష్ట్ర కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే గురువారం 25,833 కొత్త కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు, గత ఏడాది నమోదైన రోజువారీ కేసులలో పోల్చిచూస్తే ఇది అత్యధికంగా ఉంది. సెప్టెంబర్ 11 న రాష్ట్రంలో అత్యధికంగా కరోనావైరస్ కేసులు 24,886 నమోదయ్యాయి. ఇప్పుడు గత ఏడాది కేసుల కంటే పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవ్వడం మహారాష్ట్ర వాసులకు ఆందోళన కలిగిస్తుంది.

4 కోట్ల మందికి చేరువగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం
గత 24 గంటల్లో మహారాష్ట్రలో 58 మరణాలు సంభవించగా, 12,764 రికవరీలు నమోదయ్యాయి.
ఇప్పటివరకు భారతదేశం 23 కోట్లకు పైగా కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించింది. ఇందులో మొత్తం కేసుల సానుకూలత రేటు 4.93 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.37 శాతంగా ఉంది. 4 కోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా కరోనా నుండి కాపాడే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. గురువారం నాటికి, కోవిడ్ -19 వ్యాక్సినేషన్ చూస్తే మొత్తం 3,71,43,255 మందికి టీకాలు వేశారు.

పంజాబ్ లోనూ కరోనా సెకండ్ వేవ్ .. 9 జిల్లాలలో రాత్రి కర్ఫ్యూ
పంజాబ్ రాష్ట్రంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ చూస్తుండటంతో, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గురువారం రాష్ట్రంలోని తొమ్మిది తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలలో రాత్రి కర్ఫ్యూను రెండు గంటలు పొడిగించారు . అంతే కాదు ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇక ప్రస్తుత కరోనా పరిస్థితులు మరోమారు భారతదేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతేడాది ఇదే ఈ నెలలో కరోనా భయంతో విధించిన లాక్ డౌన్ కారణంగా భారతదేశం ఆర్థిక కష్టాలను అనుభవించింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications