చలికాలంలో కోరలు చాస్తున్న కరోనా .. ఎన్సిడిసి వార్నింగ్ తో ఢిల్లీలో భయం.. వణుకుతున్న జనం
భారతదేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. తన పంజా విసురుతూనే ఉంది. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య అరవై ఎనిమిది లక్షలకు పైగా చేరింది . ఇప్పుడు చలికాలం వస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశముందని భయాందోళన వ్యక్తం అవుతుంది. చలి వాతావరణంలో కరోనావైరస్ మరింత ఉద్ధృతరూపం దాల్చే ప్రమాదం ఉందని.. వేగంగా వ్యాపించవచ్చని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.

శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ ... వైద్య నిపుణుల ఆందోళన
శీతాకాలంలో ప్రపంచం కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా మంది వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . సహజంగా చలికాలంలో చాలామంది ఆస్తమా తదితర శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడతారు. ఢిల్లీలో కేసుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదిక ద్వారా హెచ్చరించింది . ఒక్క ఢిల్లీలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రానున్న రోజుల్లో ఢిల్లీ భారీ కేసులకు రెడీ అవ్వాలని ఎన్సిడిసి హెచ్చరిక
రాబోయేది శీతాకాలం. శ్వాసకోశ సమస్యలు ఈ సీజన్ లో ఎక్కువగా విజృంభిస్తాయి. అంతేకాదు బయటి నుండి పెద్ద సంఖ్యలో పండుగల సీజన్ కావడంతో చాలామంది ఢిల్లీకి వస్తూ పోతూ ఉంటారు. దీంతో చలికాలాన్ని, పండుగల సీజన్ ను పరిగణనలోకి తీసుకొని రోజుకు సుమారు 15 వేల కరోనా పాజిటివ్ కేసులకు ఢిల్లీ సిద్ధం కావాలని ఎన్సిడిసి రూపొందించిన ఒక నివేదిక హెచ్చరించింది.
ఎన్ఐటిఐ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ అధ్యక్షతన నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) రూపొందించిన నివేదికలో ప్రస్తుతం ఉన్న దానికంటే ఐదు రెట్లు ఎక్కువగా ఆసుపత్రిలో రోగుల కోసం ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

శీతాకాలం .. శ్వాసకోశ వ్యాధుల సీజన్ ..
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తన రివైజ్డ్ స్ట్రాటజీ ఫర్ కంట్రోల్ ఫర్ కోవిడ్ -19 వెర్షన్ 3.0 లో కూడా ఢిల్లీలో మొత్తం కరోనా వైరస్ కేసుల మరణాల రేటు 1.9 శాతం ఉందని, ఇది జాతీయ సగటు 1.5 శాతం కంటే ఎక్కువగా ఉందని గుర్తించారు. కరోనా మహమ్మారి నియంత్రణ మార్గాలలో మరణాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం ఒకటని సెంటర్ పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం శీతాకాలంలో సహజంగానే శ్వాసకోస అనారోగ్యాలు తీవ్రంగా ఉంటాయి.

పండుగలు, బంధువుల కలయిక ,వలస ప్రజల రాకపోకలతో కేసుల తీవ్రతకు ఛాన్స్
పండుగల కారణంగా బంధుమిత్రులు కలవడం, దీంతో అకస్మాత్తుగా కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఢిల్లీలో వలస ప్రజలు ఎక్కువగా వచ్చి పోతున్న నేపథ్యంలో, ఇతర ప్రాంతాల నుండి వచ్చే రోగుల సంఖ్య కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది
ఒక్క ఢిల్లీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చలికాలం వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కరోనా వైరస్ ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థ పై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తస్మాత్ జాగ్రత్త .. వింటర్ సీజన్ లో కరోనా డేంజర్ బెల్స్
శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి కూడా కరోనా వైరస్ సోకే అవకాశం ఉండటంతో శీతాకాలం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కరోనా వైరస్ సోకిన తరువాత చల్లని వాతావరణం ఉంటే వైరస్ తీవ్రత త్వరగా తగ్గే అవకాశం లేదని కూడా గత పరిశోధనల్లో తేలింది. దీంతో కరోనా వైరస్ మహమ్మారి నుండి వచ్చే చలికాలం మనల్ని మనం రక్షించుకోకుంటే దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగించడం ఖాయమని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ స్పష్టంగా చెబుతోంది.












Click it and Unblock the Notifications