అంబులెన్స్ దొరక్క తండ్రి మృతదేహం కారుపై కట్టేసి..కరోనా మృత్యు ఘోష ; హృదయవిదారకం!!
భారతదేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆసుపత్రుల మార్చురీలలో గుట్టలుగుట్టలుగా పెరుగుతున్న శవాలు , స్మశానాలలో కరోనా మృతుల సజీవ దహనాలు, అంత్యక్రియల కోసం శవాలతో కరోనా మృతుల బంధువుల ఎదురుచూపులు వెరసి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఏ నగరంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా కరోనా మహమ్మారి తాలూకు విషాద ఛాయలు కనిపిస్తున్నాయి.
కరోనా మృతదేహాన్ని కారుపై కట్టేసి స్మశానానికి తరలించిన తనయుడు
కరోనా బారినపడి మృతి చెందిన ఓ వ్యక్తి కుమారుడు తన తండ్రి మృతదేహాన్ని కారుపై కట్టి స్మశానానికి తరలించిన సంఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అంబులెన్స్ దొరకక అమన్ అనే వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని తన కారు పై టాప్ మీద కట్టి అంత్యక్రియల కోసం స్మశానానికి తీసుకు వెళ్ళాడు. కరోనాతో మృతి చెందిన తండ్రి మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ సైతం దొరక్కపోవడంతో తానే స్వయంగా మృతదేహాన్ని కారుపై బంధించి ఆగ్రా యొక్క మోక్షధామ్లోని శ్మశానవాటికకు వెళ్లాడు. తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.
అంబులెన్స్ లు దొరక్క హృదయ విదారక పరిస్థితి
కారుపై తండ్రి మృతదేహాన్ని కట్టేసి తీసుకువచ్చిన హృదయ విదారక దృశ్యం స్మశాన వాటికలో చాలా మందిని కన్నీరు పెట్టించింది. కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా విపరీతంగా పెరిగిన మౌలిక సదుపాయాల లేమితో ఆగ్రా పట్టణం విలవిలలాడుతుంది అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ఆగ్రాలో రోజుకు 600కి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత తొమ్మిది రోజుల్లో, కోవిడ్ -19 కారణంగా 35 మంది మరణించినట్లు వర్గాలు తెలిపాయి.
అంబులెన్స్ ల కొరతతో మృతదేహాల తరలింపుకు జాప్యం .. భారీ డిమాండ్
అంబులెన్స్ల కొరత మధ్య, కోవిడ్ -19 బాధితుల మృతదేహాలను స్మశాన వాటికలకు తీసుకెళ్లడానికి ప్రజలు మృతదేహాలతో దాదాపు ఆరు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ఆగ్రాలోని ప్రైవేట్ ఆసుపత్రులలో బెడ్లు ఖాళీ లేవని సమాచారం. ఒక్క ఆగ్రాలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. అల్లకల్లోలం సృష్టిస్తోంది. కరోనా మరణాలతో స్మశాన వాటికలలో దయనీయమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
స్మశానాలలో క్యూ లైన్లలో వేచి ఉంటున్న మృతుల బంధువులు .. దేశంలో మోగుతున్న చావుడప్పు
అంత్యక్రియల కోసం కరోనా మృతుల బంధువులు క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి. సామూహిక ఖననాలు , దహనాలు వెరసి దేశంలో చావు డప్పు మ్రోగుతోంది . కరోనాతో మరణించిన మృతదేహానికి కేవలం అంత్యక్రియలకు 40 వేల రూపాయల నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారిక లెక్కల ప్రకారం ఇస్తున్న మరణాలే కాక , అనధికారిక కరోనా మరణాలు విపరీతంగా నమోదు అవుతున్నాయి . ఈ పరిస్థితులు ప్రజలకు ఊపిరాడనివ్వటం లేదు.