భారత్ లో కరోనా క్షీణత: తగ్గుతున్న యాక్టివ్ కేసులు, తాజాగా 14,623 కొత్త కేసులు, 197 మరణాలు !!
భారతదేశంలో కరోనా వ్యాప్తికి కొనసాగుతుంది. నిన్న నమోదైన కరోనా కేసులతో చూస్తే ఈరోజు కాస్త ఎక్కువగా కరోనా కేసులు నమోదైనట్లుగా కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 14,623 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 12 శాతం ఎక్కువ. తాజా కేసులతో, దేశం మొత్తం కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 3,41,08,996 కు పెరిగింది.
బుధవారం ఉదయం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 197 మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి అదుపులోనే ఉన్నప్పటికీ కరోనా మరణాలు పెరిగినట్టు కనిపిస్తోంది. భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,52,651 కి పెరిగింది. భారతదేశ రికవరీ రేటు ఇప్పుడు 98.15 శాతంగా ఉంది. గత 24 గంటల్లో అత్యధిక సంఖ్యలో కోవిడ్ -19 కేసులను నమోదు చేసిన మొదటి ఐదు రాష్ట్రాలలో కేరళ నిలిచింది. కేరళలో 7,643 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 77 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.
మహారాష్ట్రలో 1,638 కేసులు నమోదు కాగా, 49 మంది కరోనా కారణంగా మరణించారు. తమిళనాడులో 1,179 కొత్త కేసులు నమోదు కాగా, 16 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. పశ్చిమ బెంగాల్లో 726 కేసులు గత 24 గంటల్లో నమోదుకాగా, తొమ్మిది మంది కరోనా కారణంగా మరణించారు. మిజోరంలో 665 కేసులు నమోదయ్యాయి. మిజోరాం లో గత 24 గంటల్లో నలుగురు మరణించారు. ఈ ఐదు రాష్ట్రాల నుంచి 81.04 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి, కేరళ మాత్రమే 52.27 శాతం కొత్త కేసులకు కారణమైంది. దేశంలోనే కేరళ రాష్ట్రంలో అత్యధిక మరణాలు కూడా నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే గత 24 గంటల్లో మొత్తం 19,446 మంది రోగులు కోలుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలను 3,34,78,247 కు తీసుకు వెళ్ళింది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 1,78,098 వద్ద ఉంది. గత 24 గంటల్లో, యాక్టివ్ కేసులు 5,020 తగ్గాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల రేటు 0.52 శాతానికి తగ్గినట్లు సమాచారం.భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం భారతదేశం 100 కోట్ల వ్యాక్సిన్ డోసులకు చేరువగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 41,36,142 మోతాదులను నిర్వహించింది. ఇది మొత్తం మోతాదుల సంఖ్యను 99,12,82,283 కి తీసుకు వెళ్ళింది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో మొత్తం 13,23,702 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే హెచ్చరిస్తోంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూర నిబంధనలను పాటించాలని, వ్యాక్సిన్లను తీసుకోవాలని సూచిస్తున్నాయి. మహమ్మారి బారినుండి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమకు తాము జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications