కేరళలో కరోనా కలకలం; మహమ్మారి వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
భారతదేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం కలవరంగా మారింది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు దారుణ పరిస్థితులను చూశాయి.
తాజాగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 41 శాతం కేసులు ఒక కేరళ రాష్ట్రంలోనే వస్తున్న పరిస్థితి ప్రస్తుతం కేరళ వాసులకు ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2876 మంది కరోనా బారిన పడితే కేరళ రాష్ట్రంలో 1193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు సగం కేసులు కేరళ నుండే వస్తుండటం గమనార్హం . కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేట్ 4.34 శాతంగా ఉండటం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతుంది.
కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కరోనా మరణాల సంఖ్య 66,958 కి చేరుకుంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 18 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు, నిన్న ఒక్క రోజే 27 వేల 465 కరోనా నిర్ధారణ పరీక్షలు కేరళలో నిర్వహించారు. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,064 ఉన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసులతో పోలిస్తే యాక్టివ్ కేసులు కేరళ రాష్ట్రంలో అత్యధికంగా ఉండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కేసులు తగ్గుతున్నప్పటికీ కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెబుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న పరిస్థితులలో నిర్లక్ష్యం మంచిదికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇంకా నమోదు అవుతున్నాయని, మరోపక్క చైనా వంటి దేశాలు మరోమారు లాక్ డౌన్ లో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తు చేస్తుంది. ఇక కేరళలో పరిస్థితిని కట్టడిలోకి తీసుకురావడానికి కేరళ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.