పెళ్లికి కరోనా పాజిటివ్ అతిథి: నవ దంపతులతోపాటు 100 మంది క్వారంటైన్
భోపాల్: కరోనావైరస్ మహమ్మారి విపత్కర సమయంలో వివాహాలు వాయిదా వేసుకుంటే మంచిదని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటికే ఆలస్యమైందనీ, మంచి ముహూర్తాలు పోతున్నాయంటూ ప్రజలు మాత్రం వివాహాలు ఆపడం లేదు. అయితే, సరైన జాగ్రత్త చర్యలు చేపట్టకపోతుండటంతో కొన్ని వేడుకల్లో కరోనావైరస్ వ్యాప్తి జరుగుతోంది.

కరోనా అని తేలడంతో..
తాజాగా, ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వారా జిల్లాలో చోటు చేసుకుంది. నవ వధువు బంధువుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ మంగళవారం జరిగిన వివాహానికి వచ్చిన 100 మంది బంధువులు, కుటుంబసభ్యులు క్వారంటైన్లోకి వెళ్లారు. నవ దంపతులు కూడా క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పెళ్లికొచ్చిన వారంతా క్వారంటైన్లోకి.
ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి వివాహానికి హాజరయ్యాడని, అతనికి కరోనా పాజిటివ్ రావడంతో అందర్నీ క్వారంటైన్ చేశామని స్థానిక మున్సిపల్ అధికారి చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి వివాహానికి వచ్చిన బంధువులను కలిశాడని, ఇతర వ్యక్తులను కూడా కలిశాడని చెప్పారు. వారందర్నీ గుర్తించి క్వారంటైన్ చేస్తున్నట్లు తెలిపారు.

ఢిల్లీ నుంచి పెళ్లికి...
ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చిన సదరు వ్యక్తిని చింద్వారా జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారి తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నప్పుడే అతడి మరదలి వివాహానికి హాజరయ్యాడని, ఆ వివాహం తర్వాత అతనికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. సీఐఎస్ఎఫ్ అధికారి కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్ చేసినట్లు తెలిపారు.

ఎంపీలోనూ పెరుగుతున్న కేసులు
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 7261 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 313 మంది మరణించారు. 3021 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 3927 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో 1,58,897 మంది కరోనా బారినపడగా, 4540 మంది మరణించారు.












Click it and Unblock the Notifications