హమ్మయ్య .. భారత్ లో ఏడు వేలకు తగ్గిన కొత్త కేసులు; అదుపులోకి కరోనా!!
భారత దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. భారతదేశంలో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. 543 రోజుల కనిష్టానికి కరోనా కేసులు క్షీణించాయి.భారతదేశంలో గత 24 గంటల్లో 7,579 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 10.7% తక్కువ. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,26,480కి చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం సోమవారం నాడు 9,64,980 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 7,579 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కరోనా కొత్త కేసులలో టాప్ 5 లో ఉన్న రాష్ట్రాలు ఇవే
అత్యధిక కోవిడ్-19 కేసులను నమోదు చేసిన మొదటి ఐదు రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరం, అస్సాం నిలిచాయి.కేరళలో 3,698 కేసులు, తమిళనాడులో 750 కేసులు, పశ్చిమ బెంగాల్లో 615 కేసులు, 423 కేసులతో మిజోరం మరియు 192 కేసులతో అస్సాం ఎక్కువ రోజువారీ కేసులు నమోదు చేసిన రాష్ట్రాలుగా ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో 236 మరణాలు నమోదయ్యాయి. మొత్తం నివేదించబడిన మరణాల సంఖ్య 4,66,147కి పెరిగింది. అత్యధిక మరణాలు కేరళలో 180 నమోదుకాగా, పశ్చిమ బెంగాల్లో 14 నమోదయ్యాయి.

కేరళ నుండే అత్యధిక కేసులు, మరణాలు
కొత్త కోవిడ్-19 కేసులలో 74.91% ఈ ఐదు రాష్ట్రాల నుండి నివేదించబడ్డాయి, 48.79% కొత్త కేసులకు కేరళ మాత్రమే కారణమైంది.భారతదేశం యొక్క రికవరీ రేటు ఇప్పుడు 98.32% వద్ద ఉంది. గత 24 గంటల్లో మొత్తం 12,202 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీనితో దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్న వారి సంఖ్య 3,39,46,749కి చేరుకుంది. ప్రస్తుతం నమోదవుతున్న రోజువారీ కేసుల కంటే, కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. క్రియాశీల కేసులు కూడా తగ్గుతుండటం భారతదేశానికి భారీ ఊరటనిస్తుంది. క్రియాశీల కేసుల రేటు ప్రస్తుతం 0.33 శాతానికి పడిపోయింది. గత కొంతకాలంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో కేసులలో భారీ తగ్గుదల నమోదు అవుతుంది. ఇది భారతదేశానికి ఊరటనిస్తుంది.
గణనీయంగా తగ్గిన క్రియాశీల కేసుల సంఖ్య
ప్రస్తుతం భారతదేశం యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 1,13,584 వద్ద ఉంది. గత 24 గంటల్లో, యాక్టివ్ కేసులు 4,859 కి తగ్గాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతుంది. భారతదేశం గత 24 గంటల్లో మొత్తం కరోనా మహమ్మారి నివారించడానికి 71,92,154 వ్యాక్సిన్ డోస్లను అందించింది. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,17,63,73,499 వ్యాక్సిన్ డోస్లు అందించబడ్డాయి. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కోవిడ్-19 కోసం మొత్తం 9,64,980 నమూనాలను పరీక్షించారు.
కరోనా క్షీణతకు కారణాలు ఇవే
భారతదేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు దసరా మరియు దీపావళి పండుగ సీజన్ కారణం కాలేదు. ఎపిడెమియోలాజికల్ నిపుణులు అక్టోబరు మరియు నవంబర్లలో మూడవ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ముందుగా అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది.రోజువారీ కొత్త కేసులు మేలో రోజుకు 4,00,000 కంటే ఎక్కువ నుండి ప్రస్తుతం రోజుకు 10,000 కేసులకు పడిపోయాయి. భారతదేశంలో, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి "సెరోసర్వేలు" క్రమం తప్పకుండా నిర్వహించబడుతున్నాయి.జూలైలో జరిగిన నాల్గవ జాతీయ సర్వేలో భారతదేశం అంతటా 67.6% మందికి కోవిడ్-19 యాంటీబాడీలు ఉన్నాయని నివేదించింది. ఇప్పటికీ ప్రజల్లో కరోనా మహమ్మారిని తట్టుకునే యాంటీ బాడీలు పెరగటం, కరోనా వైరస్ ప్రభావం క్షీణించటం, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కూడా కరోనా వ్యాప్తి అదుపులోకి రావటానికి కారణాలుగా భావించొచ్చు












Click it and Unblock the Notifications