భారత్ లో కరోనా విలయం .. 40 వేలను దాటిన కొత్త కేసులు, ఇలా అయితే కట్టడి కష్టమే !!
భారతదేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరిగిపోతోంది . కరోనా రెండో దశలో కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 40 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . దేశంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని , రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, కరోనా సెకండ్ వేవ్ ను నియంత్రించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
Recommended Video
కొంప ముంచుతున్న కరోనా ... భారత్ లో 40 వేలకు చేరువగా కేసులు.. మోగుతున్న డేంజర్ బెల్స్
పెరుగుతున్న కేసులతో ఆందోళన .. అప్రమత్తంగా ఉండాలంటున్న కేంద్రం
విపరీతంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులతో ఆందోళన కారణంగా తిరిగి అనేక రాష్ట్రాలలో విద్యా సంస్థలను మూసి వేస్తున్నారు. అలాగే బహిరంగ సభలపై ఆంక్షలు, వర్తక వాణిజ్య సముదాయాలలో కరోనా నిబంధనలను పాటించడం తప్పనిసరి చేశారు. ఇక పరిశ్రమలలో కూడా సామాజిక దూరం పాటించాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్క్ ఫ్రం హోం పని చేసే అవకాశం ఉన్న సంస్థలు ఇళ్ల నుండి పని చేయించుకునే విధానాన్ని అవలంబించాలని సూచిస్తున్నారు.
గత 24 గంటల్లో భారతదేశంలో 40,953 పాజిటివ్ కేసులు , 188 మరణాలు
గత 24 గంటల్లో భారతదేశంలో 40,953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు నాలుగు నెలల తర్వాత రోజువారీ కేసులలో ఈ స్థాయి కేసులు నమోదు కావడం ఇదే అధికం. దీంతో ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 1. 15కోట్లకు పైగా చేరింది. ఇక మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో 188 మంది మృతి చెందగా, ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాలు 1,59,558 కి చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు 2,88,394 కు చేరుకున్నాయి.
మహారాష్ట్ర ,పంజాబ్ వంటి రాష్ట్రాలలో కఠిన ఆంక్షలు
ఇక దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తోంది. పంజాబ్ లోనూ కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాత్రి తొమ్మిది గంటల నుండి రాత్రి కర్ఫ్యూ విధించారు . మొత్తం కరోనా ప్రభావం ఉన్న 8 జిల్లాలలో పంజాబ్ లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది.
ఇక మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుంది .
వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా పెరుగుతున్న కేసులతో ఆందోళన
మొత్తం నాలుగు కోట్లకు పైగా ప్రజలకు ఇప్పటి వరకు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగినట్లుగా తెలుస్తుంది . మార్చి 19 నాటికి 4,20,63,392 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి . ఒకపక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నా విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు భారతదేశాన్ని తిరిగి దారుణమైన పరిస్థితుల వైపు నడిపిస్తున్నాయి. మరోమారు దేశంలో లాక్ డౌన్ విధిస్తారేమో అన్న చర్చకు పెరుగుతున్న కేసులు ఊతమిస్తున్నాయి.