భారత్లో 16 శాతం జనాభాకు పూర్తి వ్యాక్సిన్: పండగలొస్తున్నాయ్! జాగ్రత్తంటూ కేంద్రం వార్నింగ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ థర్డ్ వేవ్ ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది. ఇటీవల రెండు సార్లు 24 గంటల్లోనే కోటికిపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 66 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.
కాగా, దేశంలో ఇప్పటి వరకు 16 శాతం మంది అర్హులైన జనాభాకు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఇక 54 శాతం మందికి ఒక డోసు పూర్తయినట్లు తెలిపింది. మరోవైపు, సిక్కిం, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతంలో 100 శాతం మందికి(18ఏళ్లు పైబడినవారు) కనీసం ఒక డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
ఒక్క ఆగస్టులోనే దేశ వ్యాప్తంగా 18.38 కోట్ల డోసులను పంపిణీ చేశామని, సగటున రోజుకు 59.29 లక్షల మంది టీకాలు తీసుకున్నారని తెలిపారు. మరోవైపు దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోనే దేశంలో సగానికి కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
రానున్నది పండగల కాలం కావడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని రాజేశ్ భూషణ్ సూచించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారు కూడా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. గుంపులు గుంపులుగా చేరే కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. పండగలను ఇళ్లల్లోనే జరుపుకుంటే మరింత మేలని ఆయన వ్యాఖ్యానించారు. లేదంటే కరోనా థర్డ్ వేవ్ను ముందుగానే ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, గత 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు 47వేలు దాటగా, మరణాలు 500పైనే నమోదయ్యాయి. కొత్త కేసులు ఈ స్థాయిలో ఉండటం రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. అయితే, 70 శాతం ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 47,092 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది.
Recommended Video
తాజాగా, 509 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,39,529కు పెరిగింది. బుధవారం 35,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.20 కోట్ల మందికి చేరింది. రికవరీ రేటు 97.48 శాతంగా ఉంది. మరోవైపు, కేరళలో రాష్ట్రంలోనే దేశంలో సగానికిపైగా ఇక్కడే కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 32,803 కొత్త కేసులు వెలుగుచూశాయి. బుధవారం 173 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,89,583 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.19 శాతానికి పెరిగింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. బుధవారం 81 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు 66 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం జరిగింది.