ఉత్తరప్రదేశ్లో మహా విషాదం... కరోనా కాటుకు 577 మంది టీచర్లు మృతి.. ఎన్నికలే కారణం..?
ఓవైపు కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతుంటే... మరోవైపు ఈ ఎన్నికలేంటి... దేశంలో చాలామంది ఇప్పుడీ ప్రశ్న లేవనెత్తుతున్నారు. కరోనా కాలంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు,ఉత్తరాఖండ్లో కుంభమేళా నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కరోనా బారినపడి 577 మంది టీచర్లు మృతి చెందడం గమనార్హం. కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ... రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి టీచర్ల చావులకు కారణమయ్యారని అక్కడి టీచర్స్ అసోసియేషన్ ఆరోపిస్తున్నాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఒక నివేదిక సమర్పించింది. పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించి కరోనా బారినపడి చనిపోయిన 577 మంది టీచర్ల వివరాలను అందులో పేర్కొంది. రాష్ట్రంలోని 71 జిల్లాల్లో కరోనాతో మృతి చెందిన టీచర్ల వివరాలను సేకరించి అందులో పొందుపరిచింది.
'రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ను కోరాం. కానీ మా విజ్ఞప్తిని కమిషన్ పట్టించుకోలేదు. మే 2వ తేదీ పంచాయతీ ఎన్నికల ఫలితాలనైనా నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ను కోరాం.' అని యూపీ శిక్షక్ మహాసంఘ్ అధ్యక్షుడు దినేశ్ చంద్ర శర్మ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా చాలామంది టీచర్ల ఆరోగ్య పరిస్థితిపై ఇంకా సమాచారం అందాల్సి ఉందని దినేశ్ శర్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితి చాలా విషమంగా ఉందని పేర్కొన్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ మే 2న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయకపోతే... తామే బాయ్కాట్ చేయాల్సి న పరిస్థితి రావొచ్చు అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించి కరోనా బారినపడి చనిపోయిన టీచర్లు,ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మరణాలపై వివరణ ఇవ్వాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు మంగళవారం(ఏప్రిల్ 27) ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. మరోవైపు టీచర్ల మరణాలపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్దారించాలని స్పెషల్ వర్క్ ఆఫీసర్ ఎస్కే సిన్హా అన్ని జిల్లాల మెజిస్ట్రేట్స్,ఎస్పీలను ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్లో ఈ నెల 15,19,26,29 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. టీచర్లు,ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలామంది టీచర్లు,ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. వీరిలో 577 మంది టీచర్లు మృతి చెందినట్లు టీచర్స్ అసోసియేషన్ చెబుతోంది.