Coronavirus alert: కరోనా అనుమానితుల చేతికి స్టాంపు, ఎందుకంటే..?
ముంబై: మహారాష్ట్రంలో వేగంగా కరోనా వ్యాపిస్తుండటంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే విద్యాలయాలు, సినిమాహాళ్లు, మాల్స్ను పలు ప్రాంతాల్లో మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా అనుమానితుల చేతికి స్టాంపు..
ఇళ్లలోనే క్వారంటైన్లో ఉన్న కరోనా అనుమానితుల ఎడమ చేతిపై చెరిగిపోని ఇంకుతో స్టాంపు వేయాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఆ స్టాంపులో ‘ముంబై వాసులను రక్షిస్తున్నందుకు గర్వపడుతున్నాను. హోమ్ క్వారంటైన్డ్' అనే వ్యాఖ్యలు ఉన్నాయి. అంతేగాక, ఏ తేదీ వరకు క్వారంటైన్లో ఉండాలి అనే సమాచారం కూడా ఉంది.

అందుకే ఈ స్టాంపులు..
ఈ చర్య(చేతికి స్టాంపులు వేయడం) ద్వారా వారిని గుర్తించడం సులభమవుతుందని, వారు సాధారణ ప్రజలతో కలవకుండా నిరోధించవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తెలిపారు. ఇరాన్లో రెండు కేసులతో మొదలైన కరోనా వైరస్.. రెండో వారంలో 43, మూడో వారంలో 245, అనంతరం ఐదో వారంలో 12,500కు చేరాయని సీఎం గుర్తు చేశారు.

కరోనా రెండోదశలో మహారాష్ట్ర..
కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 36 కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల ఇతరులకు కరోనా సోకే రెండో దశలో ఈ రాష్ట్రం ఉన్నట్లు గుర్తించారు. సమాజంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం కరోనా మూడోదశగా నిర్ణయించారు. రెండో దశకు చేరిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు కరోనాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
Recommended Video

హోటళ్లలోనూ క్వారంటైన్లు..
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్లో ఉంచుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఇష్టపడనివారి కోసం విమానాశ్రయ సమీపంలోని హోటళ్లలో కూడా క్వారంటైన్ ఏర్పాట్లు చేయడం గమనార్హం. అయితే, ఇందుకు అయ్యే ఖర్చులు మాత్రం సదరు వ్యక్తులు భరించాల్సి ఉంటుంది. కాగా, సాధారణ హోటల్ ధరలో సగమే చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మిరాజ్, ఐటీసీ, మరాఠా హోటళ్లలో ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాగా, రానున్న 20 రోజులు కీలకమని, ఈ వ్యవధిలో వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటే దాదాపు కరోనాను నిరోధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications