దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు: 3072కి చేరిక, 75 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మనదేశంలో ఇప్పటి వరకు 3072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 75 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 213 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

24గంటల్లోనే 525 కేసులు నమోదు..
24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 525 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు ఒక్కసారిగా మూడువేలు(3072) దాటడం గమనార్హం. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ కరోనావైరస్ విస్తరించిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 490 కేసులు నమోదుయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశ రాజధానిలో ప్రకంపనలు..
ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ కరోనావైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో ఇప్పటి వరకు 445 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనావైరస్ సమూహ సంక్రమణ స్థాయికి ఇంకా చేరుకోలేదని, ప్రస్తుతం స్థానిక సంక్రమణలోనే ఉందని తెలిపారు. మొత్తం కేసుల్లో కేవలం 40 మందికి మాత్రమే స్థానికంగా ఈ వైరస్ సంక్రమించిందని చెప్పారు. మిగిలినవారంతా విదేశీ ప్రయాణాలు చేసినవారు లేదా నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడికి ప్రధాని ఫోన్...
ఇది ఇలా వుండగా, కరోనావైరస్పై కలిసి పోరాటం చేయాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కరోనాపై పోరాడే విషయంలో తమ మధ్య విస్తృత చర్చ జరిగినట్లు తెలిపారు. కరోనా మహమ్మారిపై ఈ రెండు దేశాలు కలిసికట్టుగా పోరాటం చేస్తాయన్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో కూడా కరోనాపై ఫోన్లో సంభాషించారు. కరోనాపై పోరాటంలో పరస్పర సహకారం అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications