లాక్డౌన్ ఎఫెక్ట్ : పంతులు లేరు, పూలు లేవు..తూతూ మంత్రంగా అంత్యక్రియలు
కరోనావైరస్.. ఎక్కడో పుట్టిన ఈ మహమ్మారి మనదేశంలోకి ప్రవేశించి ప్రజల బతుకులతో ఆటలాడుతోంది. మొత్తం దేశాన్నే అంధకారంలోకి నెట్టివేసింది. ఇటు ప్రజల పొట్టను కొట్టడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేసేసింది. చివరకు సొంతవారు మరణిస్తే కడచూపు కూడా చూసేందుకు లేకుండా చేసింది. అవును ప్రస్తుతం దేశంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దౌర్భాగ్యపు స్థితికి దేశం చేరుకుంది. దీనంతటికీ కారణం కరోనావైరస్.

అనాథ శవంలా స్మశానవాటికకు
అప్పటి వరకు కళ్లముందే ఎంతో ఆరోగ్యంగా తిరిగిన వారిని కరోనావైరస్ మహమ్మారి అంతం చేస్తోంది. ఇక దేశంలో కరోనావైరస్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం జరిగింది. అయితే కరోనావైరస్ సోకి మరణించిన వారే కాదు... సాధారణ మరణం పొందిన వారిని కూడా చివరి చూపు చూసేందుకు లేకుండా పోతోంది. బతికుండగా ఎంతో ఘనంగా జీవించిన వ్యక్తి మృతి చెందగానే అనాథలా స్మశానవాటికకు చేరుకుంటున్నాడు. కనీసం హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించాల్సిన అంత్యక్రియలు కూడా పద్ధతి ప్రకారం జరగడం లేదు. ఎందుకంటే ఒక మృతదేహాన్ని ఈ కష్టసమయంలో తాకేందుకు కానీ లేదా దగ్గరకు వచ్చేందుకు కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక ప్రభుత్వం సూచించిన గైడ్లైన్స్ ప్రకారం ఐదుగురు కంటే ఎక్కువగా మృతదేహం అంత్యక్రియలు నిర్వహించకూడదు. ఈ క్రమంలోనే స్మశాన వాటికకు మృతదేహంను తీసుకొచ్చేందుకు నలుగురు వ్యక్తులు, దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఒకరు మాత్రమే వస్తున్నారు.

దహన సంస్కారాలకు దొరకని పూలు, ఇతర వస్తువులు
ఇక మృతి చెందిన వ్యక్తిని ఘనంగా పంపుదామని అనుకున్నా పూలు లేవు, దండలు లేవు. ఇలాంటి ఘటనే ముంబైలో చోటుచేసుకుంది. శశికాంత్ కాంబ్లే అనే వ్యక్తి తండ్రి ఉన్నట్లుండి కుప్పకూలాడు. దీంతో ఆయన్ను హాస్పిటల్కు తరలించగా అక్కడ చనిపోయాడు. ఇక అతని అంత్యక్రియలు జరిగిన తీరు చూసి కుటుంబమంతా భోరున విలపించింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలతో కేవలం నలుగురు మాత్రమే అంతిమసంస్కారాలు పూర్తి చేశారు. అంతిమయాత్రకు దహన సంస్కారాలకు కావాల్సినవేవీ తమకు దొరకలేదని కేవలం ఒక తెల్లబట్టలో తన తండ్రి మృతదేహాన్ని చుట్టి అంతిమసంస్కారాలు పూర్తి చేశామని చెబుతూ భోరున విలపించాడు కాంబ్లే. ఇక అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక పూజారీ కూడా లేడని చెప్పాడు.
Recommended Video

లాక్డౌన్ వల్ల బంధువులకు నో పర్మిషన్
ఇక ప్రజలు కూడా లాక్డౌన్ సందర్భంగా ఇళ్లకే పరిమితమయ్యారని చెప్పిన కాంబ్లీ, సొంతవారు మరణిస్తే ఈ సమయంలో ఇళ్లను కూడా వదిలిరావడం లేదని చెప్పాడు. కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే చూసేందుకు వచ్చారని అయితే వారు కూడా అంతిమయాత్రలో పాల్గొనలేదని వెల్లడించాడు. ఇక లాక్డౌన్ నిబంధనలతో స్మశాన వాటికలు చాలా వరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సిబ్బంది కూడా అంతంతమాత్రమే ఉంటున్నారు. ఒకవేళ ఉన్నా ఎక్కువమందిని స్మశానవాటికలోకి రానివ్వడం లేదు. అదే సమయంలో చనిపోయిన వ్యక్తి బంధువులు కూడా తమకు సహకరిస్తున్నారని చెబుతున్నారు. కరోనావైరస్ భయం ఎక్కువగా ఉండటంతో తాము కూడా అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు స్మశానవాటిక అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications