గౌతం గంభీర్కు లైసెన్స్ ఉందా..మరి ఆ మందులు ఎక్కడివి: ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
ఢిల్లీ: ఢిల్లీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ కనిపించని మహమ్మారి ప్రజల ఆరోగ్యాలపై దాడి చేస్తుండటంతో అక్కడి పరిస్థితి అత్యంత భయంకరంగా తయారైంది. ఆక్సిజన్ కొరతతో ప్రజలు హాస్పిటల్ ఆవరణలోనే ప్రాణాలు వదిలేస్తుండగా... మరికొందరు హాస్పిటల్లో చేరుకునే క్రమంలోనే చనిపోతున్నారు. ఇక ఇప్పటికే మిగులు ఆక్సిజన్ ఉంటే ఢిల్లీకి తరలించాలంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ కూడా రాశారు. ఢిల్లీలో కరోనాతో పరిస్థితి మరింత దిగజారిపోవడంతో రంగంలోకి దిగిన ఢిల్లీ హైకోర్టు కేసులును సుమోటోగా తీసుకుని విచారణ చేస్తోంది. ఢిల్లీలో తాజా పరిస్థితి, అందుబాటులో ఉంటున్న మందులు గురించి ఢిల్లీ న్యాయస్థానం ఆరా తీసింది.
ఢిల్లీలో కరోనావైరస్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు స్వయంగా హైకోర్టు పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ టీమిండియా క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కరోనా మెడిసిన్స్ను తన నియోజకవర్గపు ప్రజలకు ఎలా పంచుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అంత పెద్ద మొత్తంలో ఆ టాబ్లెట్లను ఎలా కొనుగోలు చేయగలిగారని ప్రశ్నించింది.ఈ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్స్ చేయబడ్డవే కదా అలాంటప్పుడు గౌతం గంభీర్కు ఎలా లభిస్తున్నాయని ప్రశ్నించింది. గంభీర్ ఈ డ్రగ్స్ను డీల్ చేసేందుకు లైసెన్స్ కలిగి ఉన్నాడా అని ప్రశ్నించింది. ఈ మందులకు లైసెన్స్ ఉండక్కర్లేదా అని న్యాయమూర్తులు జస్టిస్ విపిన్ సంఘీ, రేఖా పల్లిలు ప్రశ్నించారు.

ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ రాహుల్ మెహ్రా. ఒక వేళ ఆ డ్రగ్స్ గౌతం గంభీర్ తన నియోజకవర్గ ప్రజలకు పంచిపెడుతున్నట్లయితే అది బాధ్యతారాహిత్యమే అవుతుందని అడ్వకేట్ రాహుల్ మెహ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందు గౌతం గంభీర్ ఒక బాధ్యతాయుత ఎంపీ పదవిలో ఉండి ఫాబిఫ్లూ టాబ్లెట్స్ను పంచిపెడుతున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు గత వారం గంభీర్ చేసిన ట్వీట్లను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్ చికిత్సలో భాగంగా వినియోగించే ఫాబీఫ్లూతో పాటు ఇతర ఔషధాల కొరత ఏర్పడటంతో గౌతం గంభీర్ పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ కొనుగోలు చేశాడంటూ కోర్టుకు తెలిపారు ఢిల్లీ ప్రభుత్వం తరపున న్యాయవాది రాహుల్ మెహ్రా. అయితే అవి తనకు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయో అర్థం కావడం లేదని వివరించారు.
వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఒక నియోజకవర్గం ప్రజల అవసరాలు తీరేలా ఇంత పెద్ద మొత్తంలో ఫాబీ ఫ్లూ మెడిసిన్ గౌతం గంభీర్కు ఎవరు సప్లయ్ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ఈ కష్టకాలంలో ఉచితంగా మందులు సరఫరా చేయడం మంచి పనే అయినప్పటికీ.. ఇతర ప్రాంతాల వారికి మందులు దొరక్క పోవడం, కేవలం గంభీర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈస్ట్ ఢిల్లీ ప్రజలకు మాత్రమే తాను అందజేస్తుండటంలో ఏదో గందరగోళం ఉందనే అంశాన్ని రాహుల్ మెహ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై వీలైనంత త్వరగా స్పష్టత వస్తే బాగుంటుందని కోర్టు ముందు తన వాదనలు వినిపించారు.












Click it and Unblock the Notifications