Coronavirus: జనతా కర్ఫ్యూ, వాకింగ్ లు, ఉప్పర మీటింగ్ లు అంటే బెండ్ తీస్తారు, జాగ్రత్త !
బెంగళూరు: ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న మహ్మమారి కరోనా వైరస్ (COVID 19) భారతదేశంలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 2, 82, 744 కరోనా వైరస్ వ్యాధి కేసులు నమోదైనాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధితో 11, 820 మంది మరణించారు. భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 271కి చేరింది. ముంబై, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ లో కరోనా వైరస్ వ్యాధి కారణంగా నలుగురు మరణించారు. కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. జనతా కర్ఫూ రోజు రోడ్లు ఖాళీగా ఉన్నాయని ఎవరైనా బయటకు వచ్చి వాకింగ్ లు, ఉప్పర మీటింగ్ లు అంటూ నానా హంగామా చెయ్యడానికి ప్రయత్నిస్తే బెండ్ తీసి కేసులు నమోదు చేస్తామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ వార్నింగ్ ఇచ్చారు. జనతా కర్ఫ్యూకు అందరూ సహకరించి కరోనా వ్యాధికి కళ్లెం వెయ్యడానికి సహకరించాలని బెంగళూరు నగర పోలీసులు మనవి చేస్తున్నారు.
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు కరోనా భయం కొంచెం కూడా లేదు, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు !
ఇంటికే పరిమితం కావాలి !
కరోనా వైరస్ వ్యాధి అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాధిని వీలైనంత త్వరగా అరికట్టడానికి అందరూ సహకరించాలని, అందులో భాగంగా మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్కూకు సహకరించాలని, ఆ రోజు అందరూ ఇంటికే పరిమితం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మనవి చేశారు.
వాకింగ్ లు, ఉప్పర మీటింగ్ లు బంద్
జనతా కర్ఫ్యూ సందర్బంగా మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ మనవి చేశారు. కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడంలో భాగంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూ రోజు ఎవరైనా వాకింగ్ లు, ఉప్పర మీటింగ్ లు, పార్టీలు, ఫంక్షన్ లు అంటూ రోడ్డ మీదకు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ హెచ్చరించారు.
రోడ్లలో బ్యారికేడ్లు
మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్బంగా బెంగళూరు నగరంలో రోడ్లు ఖాళీగా దర్శనం ఇవ్వనున్నాయి. ఆ రోజు ప్రధాన రహదారలతో పాటు నగరంలోని అన్ని రహదారుల మీద బ్యారికేడ్లు ఏర్పాటు చెయ్యాలని ట్రాఫిక్ పోలీసు అధికారులకు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ ఆదేశాలు జారీ చేశారు.
బెండ్ తియ్యాలంటే బయటకు రండి !
రోడ్లు ఖాళీగా ఉన్నాయని ఎవరైనా ఇళ్ల నుంచి బయటకు వచ్చి బైక్ లు బయటకు తీసుకువచ్చి వీలింగ్ చెయ్యడానికి ప్రయత్నిస్తే బెండ్ తీస్తామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని వీలింగ్ చెయ్యడం, రోడ్ల మీద క్రికెట్ ఆడటం లాంటి పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని, మట్టంగా, మర్యాదగా ఇళ్లలో కుర్చుని టీవీలు చూస్తూ కాలక్షేపం చేసుకోవాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ సూచించారు.
మెడికల్ షాప్ లు, పెట్రోల్ బంకులు !
జనతా కర్ఫ్యూ సందర్బంగా ఆదివారం కేవలం మెడికల్ షాప్ లు, పెట్రోల్ బంకులు మాత్రమే తియ్యనున్నారు. అవసరాన్ని బట్టి పాలు, పండ్లు, కూరగాయలు, పూల మార్కెట్లు తియ్యడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా టీ షాప్ లు, చిల్లర దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ స్టాల్స్ తదితర షాప్ లు తియ్యడానికి అవకాశం లేదని పలు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అత్యవసరం అయితే !
అత్యవసర పరిస్థితులు మినహాయించి ఎవ్వరూ రోడ్ల మీద సంచరించరాదని, కరోనా వైరస్ వ్యాధి అరికట్టడానికి అందరూ అవసరమైన సహకారం అందించాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ మనవి చేశారు. బెంగళూరు నగరంలో పోలీసులతో పాటు ఆరోగ్య శాఖ, బీబీఎంపీ అధికారులు, సిబ్బంది కలిసి పనిచెయ్యాలని ఇప్పటికే నిర్ణయించారు.