కరోనా విషాదం: 9 ఆస్పత్రులు తిరిగినా దొరకని బెడ్, అంబులెన్స్లోనే నవ వధవువు మృతి
భువనేశ్వర్: కరోనామహమ్మారి ఎవరిపైనా దయ చూపడం లేదు. కరోనాతో మనుషుల్లో మానత్వం కరువైపోతోంది. పెరుగుతున్న కేసులతో సరైన వైద్యం అందడం లేదు. ఆస్పత్రులకు వెళితే బెడ్లు ఖాళీగా ఉండటం లేదు. ఈ కారణంగా అనేకమంది ఆస్పత్రుల బెడ్ల కోసం తిరుగుతూనే ప్రాణాలో కోల్పోతున్నారు. తాజాగా, ఒడిశా రాష్ట్రంలో కరోనా బారినపడి ఓ నవ వధువు వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది.
తీవ్రమైన జ్వరంతో క్షీణించిన ఆరోగ్యం..
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలోని బల్లిపట్నా ప్రాంతంలో ఉంటున్న విష్ణుతో స్వర్ణలత(25)కు ఇటీవలే వివాహమైంది. కొద్ది రోజుల క్రితం స్వర్ణలతకు జ్వరం రావడంతో మాత్రలు వేసుకున్నారు. జ్వరం తగ్గకపోగా, శనివారం ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఈ క్రమంలో బల్లిపట్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందంటూ కటక్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించి పంపించారు. దీంతో కటక్కు వెళ్లగా.. భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ అక్కడి వైద్యులు సూచించారు. ఇక వైద్యులు సూచించిన ఆస్పత్రికి వెళ్లగా.. కరోనా రిపోర్టు లేకపోతే ఆస్పత్రిలో చేర్చుకోలేమని స్పష్టం చేశారు వైద్య సిబ్బంది.
తొమ్మిది ఆస్పత్రులు తిరిగినా..
ఓ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయగా.. స్వర్ణలతకు పాజిటివ్ అని తేలింది. దీంతో వారు మరో ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ ఆస్పత్రి, తర్వాత మరికొన్ని ఆస్పత్రులు, ఇలా 9 ప్రాంతాల్లోని 9 ఆస్పత్రులు తిరిగినా ఆమెను ఏ ఆస్పత్రిలోనూ చేర్చుకోలేదు. ఎంత వేడుకున్నా ఆస్పత్రి సిబ్బంది దయచూపలేదు.
దీంతో మళ్లీ ఆమెను బల్లిపట్నా ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబసభ్యులు. ఇక్కడి వైద్యులు నిరాకరించడంతో మళ్లీ ఆమెను భువనేశ్వర్ తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ఆరోగ్యం విషమించి స్వర్ణలత అంబులెన్స్లోనే మృతి చెందారు. స్వర్ణలత మృతి రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.
అంబులెన్స్లోనే స్వర్ణలత మృతి
తొమ్మిది ఆస్పత్రులు తిరిగినా ఏ ఒక్కరూ చేర్చుకోలేదని, దీంతో తన భార్యను దక్కించుకోలేకపోయామని స్వర్ణలత భర్త బిష్ణు చరన్ భోల్ కన్నీటిపర్యంతమయ్యాడు. తానొక రైతునని, ఎక్కువగా చదువుకోలేదని.. తమకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకురాలేదని వాపోయాడు. కొన్ని ఆస్పత్రులకు వెళితే.. మనషులతో గెంటించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబులెన్స్లో సుమారు 100 కిలోమీటర్లకుపైగా ఆస్పత్రుల చుట్టూ తిరిగామని, రూ. 35వేలు అంబులెన్స్ ఖర్చులకే అయ్యాయని తెలిపాడు.పెళ్లి చేసుకున్న తర్వాత, ఇళ్లు కట్టుకుని ఎంతో ఆనందంగా జీవిస్తామని ఎన్నో ఆశలతో ఉన్న సమయంలో ఇలాంటి ఘటన తన కలలన్నింటినీ కల్లలు చేసిందని కంటతడిపెట్టారు. స్వర్ణలత మరణంతో తన గుండెపగిలిపోయిందని భావోద్వేగానికి గురయ్యాడు.. ఘటనపై సమాచారం అందడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.