కర్ణాటక భయానకం..హైరిస్క్ స్టేట్గా: సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ క్లోజ్: బర్త్డేలపైనా నిషేధం.. !
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావానికి గురైన కర్ణాటకలో ప్రభుత్వం అధికారికంగా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని కలబురగిలో కరోనా వైరస్ బారిన పడి ఓ వయోధిక వృద్ధుడు మరణించిన తరువాత.. పరిస్థితి అదుపు తప్పినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో 35 మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం, వారంతా ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ప్రస్తుత భయానక పరిస్థితుల్లో యడియూరప్ప సర్కార్.. ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Coronavirus:కరోనా... కరోనా.... కరోనా.... రూ. 20 కరోనా, వైరల్ వీడియో, బ్లాక్ మార్కెట్, భారీ డిమాండ్ !
వారంరోజుల పాటు అన్నీ బంద్..
కరోనా వైరస్ తీవ్రత కాస్తయినా తగ్గుముఖం పట్టేంత వరకూ ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లు మొదలుకుని ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్సులన్నింటినీ మూసేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘించి, వాటిని తెరిచిన వారి లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
శుభకార్యాలపైనా ప్రభావం..
ఫంక్షన్ హాళ్లను కూడా మూసివేయాలని, శుభకార్యాలను రద్దు చేసుకోవడమో లేదా వాయిదా వేసుకోవడమో చేయాలని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. ఎక్కువ మంది గుమికూడేలా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టరాదని పేర్కొంది. ప్రజలు సహకరించాలని కోరుతూ కర్ణాటక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు శుక్రవారం ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన ఏర్పాటైన వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.
కలబురగి మరణం.. కరోనా వైరస్ వల్లే..
కలబురగిలో 76 సంవత్సరాల వృద్ధుడు మరణించడానికి కారణం కరోనా వైరసేనని బీ శ్రీరాములు ప్రకటించారు. కరోనా వైరస్ సోకడం వల్లే ఆయన మరణించారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు కరోనా వైరస్ బారిన పడిన అనంతరం ఆ వృద్ధుడు ఎవరెవరిని కలిశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, వారందర్నీ ఐసొలేషన్ వార్డుల్లో చేర్పిస్తామని అన్నారు. అలాంటి వారందరూ తమకు తాముగా ఆసుపత్రుల్లో చేరాలని శ్రీరాములు సూచించారు.
కాలేజీలు..యూనివర్శిటీలకు సెలవులు..
ఈ వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు సెలవులను ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎల్కేజీ నుంచి 5వ తేదీ వరకు విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా- యూనివర్శిటీలకు కూడా వర్తింపజేసింది. వేసవి సెలవుల సందర్భంగా ఎవ్వరు కూడా సమ్మర్ క్యాంపులను నిర్వహించకూడదని ఆదేశించింది.
పెళ్లిళ్లు.. పుట్టినరోజు వంటి శుభకార్యాలే కాదు.
పెళ్లిళ్లు, పుట్టినరోజు వంటి శుభకార్యాలపై మాత్రమే కాకుండా.. సదస్సులు, పబ్బులు, నైట్ క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్, స్పోర్ట్స్ ఈవెంట్లను కూడా ప్రభుత్వం నిర్వహించరాదని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు శనివారం పంపిస్తామని బీ శ్రీరాములు వెల్లడించారు. ఉత్తర్వులను ఉల్లంఘించవద్దని ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు.
Recommended Video
ఇప్పటికే ఐటీ పార్కులు మూత..
కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే సిలికాన్ సిటీగా పేరున్న బెంగళూరులోని పలు ఐటీ పార్కులు మూత పడ్డాయి. గూగుల్ వంటి సంస్థ కూడా మూత పడింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా ఇవే తరహా ఆదేశాలను జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం నుంచి దాదాపు అన్ని ఐటీ పార్కులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.