తెలుగువారు జాగ్రత్త: బెంగళూరులో పరిస్థితి చేదాటిపోయిందన్న సీఎం..కోవిడ్ వస్తే మరణమే శరణ్యమా..?
బెంగళూరు: కర్నాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసలు నమోదు అవుతుండటంతో అక్కడి హాస్పిటల్స్లో దాదాపుగా బెడ్లు ఏమీ ఖాళీగా లేవు. దీంతో హాస్పిటల్కు వస్తున్న వారు ఎక్కడైనా సరే చిన్న చోటు దక్కితే చాలనే పరిస్థితికి వచ్చేశారు. శుక్రవారం సాయంత్రం ఓ పేషెంట్ బెంగళూరులోని ప్రభుత్వాస్పత్రి విక్టోరియా హాస్పిటల్కు చేరుకున్నాడు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో ఐసీయూలోని వెంటిలేటర్ బెడ్ అవసరం కాగా అక్కడ లేదు. దాదాపు అరగంట పాటు వేచిచూసిన తర్వాత ఆ హాస్పిటల్లో బెడ్లు లేవని చెప్పేశారు. అయితే అక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలహంక ప్రభుత్వాస్పత్రిలో బెడ్ కోసం ప్రయత్నించమన్నారు. ఇక అక్కడికి వెళ్లే సరికి పేషెంట్ బతుకుతాడో లేదో అన్న అనుమానం కలిగిందని పేషెంట్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలాంటి కథలు బెంగళూరు ప్రభుత్వాస్పత్రిలో ఎన్నో దర్శనమిస్తాయి.
వెంటిలేటర్ బెడ్ కోసం పడిగాపులు
ఐసీయూలో వెంటిలేటర్ బెడ్ కోసం ఎదురు చూసి చాలా మంది కోవిడ్ పేషెంట్లు మృతి చెందిన ఘటనలు కొల్లలుగా బెంగళూరు ప్రభుత్వాస్పత్రిలో కనిపిస్తాయి. అంతేకాదు వీల్ ఛైర్లలోనే మూడు రోజులుగా కూర్చుని ఉన్న పేషెంట్లు బెంగళూరు ప్రభుత్వాస్పత్రిలో కనిపిస్తారు. ఆక్సిజన్ సప్లయ్ ఉన్న బెడ్లు కోసం ఎదురు చూస్తూ రిసెప్షన్లోనే ఉంటూ కాలం వెల్లదీస్తున్నవారు ఉన్నారు. ఇదిలా ఉంటే తన తల్లి కోసం ఒక బెడ్ దక్కించుకునేందుకు ప్రభుత్వాస్పత్రిలో రూ. 40వేలు లంచం ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఓ వ్యక్తి.
ఒక్కరోజే బెంగళూరులో 124 మరణాలు
బెంగళూరు విక్టోరియా ప్రభుత్వాస్పత్రిలని ఐసీయూలో వెంటిలేటర్ బెడ్లు లేకనే అక్కడ మరణాలు పెరిగిపోతున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క శుక్రవారం రోజునే బెంగళూరు నగరంలో 124 మంది మృతి చెందినట్లు సమాచారం. కోవిడ్-19తో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు బెంగళూరు నగరంలో 7 స్మశాన వాటికలను ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు 20 నుంచి 25 మృతదేహాలను ఖననం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో నాలుగు లేదా ఐదు మృతదేహాలను ఖననం చేస్తారు.
పరిస్థితి చేదాటిపోయిందన్న యడియూరప్ప
ఇక శుక్రవారం ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో పరిస్థితి చేదాటిపోయిందంటూ కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే బెంగళూరు నగరంలో 10 రెట్లు ఎక్కువగా ఐసీయూలో వెంటిలేటర్ బెడ్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. బెంగళూరు నగరంలో మొత్తం 17 ప్రభుత్వాస్పత్రులు ఉండగా.. అందులో కోవిడ్-19 పేషెంట్ల కోసం 117 ఐసీయూ వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయి. ఇక 30 పడకలున్న ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. 80శాతం బెడ్స్ను ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కోరుతోంది. మరో 15 రోజుల్లో 2వేల మేక్ షిఫ్ట్ ఐసీయూ బెడ్లను సిద్ధం చేస్తున్నట్లు కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. ఇందులో 800 బెడ్లకు వెంటిలేటర్లు ఉంటాయని వెల్లడించారు. ఇక మరణాలు ఎక్కువగా నమోదవుతుండటంతో కోవిడ్ స్మశాన వాటికలను 7 నుంచి 13కు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఏది ఏమైనప్పటికీ బెంగళూరు నగరంలో కోవిడ్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. హాస్పిటల్స్లో ఐసీయూ బెడ్లు దొరక్క పేషెంట్లు అక్కడే పడిగాపులు కాయడం చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇక బెంగళూరులోని తెలుగు వారు జాగ్రత్తగా ఉండాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. పరిస్థితి చేదాటిపోతున్న వేళ సొంతూళ్లకు కొన్నిరోజుల పాటు వెళ్లాలని నిపుణులు తెలుగు ప్రజలకు సూచిస్తున్నారు.