coronavirus: 65 ఏళ్ల వృద్ధులు బయటకి వెళ్లొద్దంటే.. పార్లమెంట్ సెషన్ ఎందుకు, టీఎంసీ ఎంపీ ప్రశ్న
కరోనా వైరస్ భారత్లో పాతుకుపోతోంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన నెలకొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని.. ముఖ్యంగా వృద్ధులు ఉంట్లోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. కానీ ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మోడీ వినతిపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పందించారు.
సమావేశాలు ఎందుకు...?
65 ఏళ్లు పైబడిన వృద్ధులు బయటకు రావొద్దని ప్రధాని మోడీ కోరారు.. మరీ పార్లమెంట్ సమావేశాలు మాత్రం ఎందుకు అని ప్రశ్నించారు. ఆదివారం జనతా కర్ప్యూ అని మోడీ చెబుతున్నారు. కానీ పార్లమెంట్ మాత్రం కొనసాగుతోంది.. దీంతో గందరగోళం నెలకొందన్నారు. శుక్రవారం ఉదయం డెరెక్ ఒబ్రెయిన్ ట్వీట్ చేశారు. పార్లమెంట్లో మెజార్టీ ఎంపీలు వృద్ధులనే సంగతి తెలిసిందే. లోక్సభలో 44 శాతం మంది ఎంపీలు, రాజ్యసభలో 22 శాతం మంది ఎంపీలు 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. విషయం మరచిపోయి ప్రకటన చేశారా అని ప్రశ్నించారు.
పార్లమెంట్లో ప్రకటించాలి కదా..?
గురువారం రాత్రి ప్రధాని మోడీ ప్రసంగాన్ని కూడా ట్వీట్లో పోస్ట్ చేశారు. ఈ నెల 2వ తేదీన పార్లెమంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు నడుస్తోండగా.. జాతిని ఉద్దేశించి మీడియాలో ప్రధాని మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. పార్లమెంట్లో కాకుండా మీడియాతో మాట్లాడటంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటే దేవాలయం.. ఇక్కడినుంచే ప్రజలకు ఏమైనా సందేశం ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. మీరు టీవీలో ప్రసంగిస్తుంటే ముఖ్యమంత్రులు తిలకిస్తారా..? ఇదేనా సమాఖ్య స్పూర్తి అని ప్రశ్నించారు.

అలర్ట్.. అలర్ట్...
పార్లమెంట్ సమావేశాలు నడుస్తోన్నందున ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి గతవారం డెరెక్ ఒబ్రెయిన్ కోరారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 9 వేలకు పైగా చనిపోగా.. లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఐదుగురు చనిపోగా.. పాజిటివ్ కేసులు 190కి చేరాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications