ఆ రెండు చోట్లా వార్ వన్ సైడేనా? మరి కాస్సేపట్లో ఫలితాలు: ఓట్ల చీలిక గుబులు
ముంబై/చండీగఢ్: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాస్సేపట్లో వెలువడబోతున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటల కల్లా తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయానికి హర్యానాలో అధికారంలోకి వచ్చేదెవరో తేలిపోతుంది. మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ తో పోల్చుకుంటే 90 సీట్లు ఉన్న హర్యానా అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ముందుగా ముగుస్తుంది. సోమవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే.. ఈ రెండు చోట్ల కూడా వార్ వన్ సైడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
వరుసగా రెండోసారి అధికారం వైపు?
మహారాష్ట్ర, హర్యానాలల్లో భారతీయ జనతాపార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానకే అధిక అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. మహారాష్ట్రలో శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే పార్టీతో కలిసి తాజాగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది. బీజేపీ-164, శివసేన-124, కాంగ్రెస్-125, ఎన్సీపీ-125 స్థానాల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల సత్తా ఏమిటో మరి కాస్సేపట్లో వెల్లడవుతుంది. కాంగ్రెస్ తరఫున ప్రధాన ప్రచారకర్తగా రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో అయిదు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
ఓట్ల చీలికపై కాంగ్రెస్-ఎన్సీపీ ఆశలు..
ఎదురుగాలి బలంగా వీస్తోందనుకుంటున్న పరిస్థితుల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మెజారిటీ స్థానాలను ఎలా సాధించగలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో అధికార పగ్గాలను అందుకోవాలంటే 145 సీట్లు కావాలి. చాలా చోట్ల బీజేపీ-శివసేన తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేశారు. వారి వల్ల ఓట్లు చీలుతాయని కాంగ్రెస్-ఎన్సీపీ భావిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేయగలమని ఆశిస్తున్నారు ఆ కూటమి నాయకులు. 145 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం కష్టమేననేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
వీర్ సావర్కర్ కు భారతరత్న మంత్రం ఫలించినట్టేనా?
తాము అధికారంలోకి వస్తే మరాఠా స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్కు భారతరత్న ఇస్తామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం వల్ల పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగినప్పటికీ.. మహరాష్ట్రియన్ల నుంచి ఎలాంటి విమర్శలు ఎదురు కాలేదు. ప్రధాని ఇచ్చిన ఈ హామీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందని, అదే మొన్నటి ఎగ్జిట్ పోల్స్ లో ప్రతిఫలించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హిందూవాదం వైపు మాత్రమే మొగ్గు చూపించిన వీర్ సావర్కర్ కు భారతరత్న ఇస్తామని ప్రకటించడం వల్ల మైనారిటీల ఓటు బ్యాంకు దూరమైందని చెబుతున్నప్పటికీ.. దాని ప్రభావం బీజేపీ-శివసేన కూటమిపై ఉండకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ తేట తెల్లం చేశాయి.