మూత్రాన్ని నిలువ చేస్తే యూరియా దిగుమతి అక్కర్లేదు, ఎయిర్ పోర్ట్లలో నిల్వ చేయాలని చెప్పా: గడ్కరీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర ప్రతిపాదన తీసుకు వచ్చారు. మూత్రం ద్వారా యూరిన్ తయారు చేయవచ్చునని ఆయన ఆదివారం నాగపూర్లో జరిగిన యువ సృజనాత్మక ఆవిష్కరణ కార్యక్రమంలో చెప్పారు. దేశవ్యాప్తంగా యూరిన్ను నిల్వ చేసుకుంటే యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
ప్రజల మూత్రాన్ని నిల్వ చేసుకుంటే విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం రాదని, ఫలితంగా చాలా డబ్బులు ఆదా అవతాయని, మానవ మూత్రం జీవ ఇంధనంగా ఉపయోగపడుతుందని, అందులో సల్ఫేట్, నైట్రోజన్ ఉంటాయని చెప్పారు.
అంతేకాదు, విమానాశ్రయాలలో మూత్రాన్ని నిల్వ చేయమని గతంలోనే తాను కోరానని, కానీ తన ప్రతిపాదనను ఎవరూ అంగీకరించలేదని, కార్పొరేషన్ కూడా తన మాటలు పట్టించుకోలేదని, సనాతన ఆచారాలను పాటించే వారికి తన అద్భుతమైన ఆలోచనలు నచ్చవని ఆయన చెప్పారు. దేశంలోని అందరి యూరిన్ను స్టోర్ చేస్తే మనకు యూరియా దిగుమతి అవసరం ఉండదన్నారు.
తన ఆలోచనలు అత్యద్భుతంగా ఉంటాయని, అందుకే తనకు ఎవరూ సహకరించరని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్డిగా ఓ పని చేస్తూ వెళ్లేలా శిక్షణ ఇస్తారని, అందుకే వాళ్లూ ఇలాంటి ఆలోచనలను స్వాగతించరని చెప్పారు.
మానవ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా ఉపయోగించుకోవచ్చునో చెప్పడానికి ఓ ఉదాహరణగా చెప్పారు. మనిషి వెంట్రుకల నుంచి అమినో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయని, అది కూడా ఎరువుగా ఉపయోగించుకోవచ్చునని, ఫలితంగా పంట రాబడి మరో 25 శాతం పెరుగుతుందని చెప్పారు. అమినో యాసిడ్స్ను మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, 180 కంటైనర్ల జీవ ఎరువులను(బయో ఫెర్టిలైజర్స్) దుబాయ్ నుంచి కొనుగోలు చేస్తున్నామన్నారు.