అన్నాచెల్లెళ్లుగా భార్యాభర్తలు: 20 మంది యువతులపై రేప్
చెన్నై: విలాసవంతమైన జీవితాన్ని సాగించాలనే ఉద్దేశంతో తమిళనాడులోని ఓ జంట చేయకూడని పనికి ఒడిగట్టారు. యువతులను మోసగించి 100 సవర్లకు పైగా నగలను దోచుకున్నారు.ఫేస్బుక్ ద్వారా ప్రేమ సందేశాలను పంపి 20 మందికి పైగా యువతులపై మగాడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
నిందితుడితో సహా భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాల్లో దంపతులు ఫేస్బుక్ ద్వారా తమ మోసాలకు బయటకు తీశారు. తిరుచ్చి తిరువేంబుయూర్కి చెందిన ఓ కళాశాల విద్యార్థిని రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయింది. ఈ సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థిని కోసం పలు చోట్ల గాలించారు.
అయితే, గత రెండు రోజుల క్రితం ఆ విద్యార్థి నావలంపట్టు పోలీసు స్టేషన్లో హాజరై ఓ యువకుడు తనను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారని, తాను ధరించిన 8 సవర్ల నగలు కూడా అపహరించి పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అ యువకుడికి అతడి సోదరి కూడా సహకరించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో చెప్పింది.
తిరువేంబుయూర్ డీఎస్పీ కలైసెల్వన్, ఇనస్పెక్టర్ సురేష్కుమార్ నేతృత్వంలోని పోలీసులు బలగాలు ఫోటో ఆధారంగా వారి కోసం తీవ్రంగా గాలింపుచర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుచ్చి బస్టాండ్లో అన్న, చెల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తిరుప్పూర్ జిల్లాకు చెందిన గురు దీన దయాళన్ అనే పట్టభద్రుడైన ఆ యువకుడు నిరుద్యోగి. ఫేస్బుక్లో యువతులతో పరిచయం పెంచుకుని, వారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నట్లు తెలిసింది.
కాగా, 2013వ సంవత్సరం ప్రియదర్శినిని ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడని, విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో దంపతులు మోసానికి తెర తీసినట్లు పోలీసులు గుర్తించారు. గురు దీనదయాళన్ ఫేస్బుక్ ద్వారా మహిళలను తన వలలో పడేసి పారిపోయి వివాహం చేసుకోవడానికి నగలతో రావాలని నమ్మించి రప్పించుకునేవాడు.
అతడి మాటలు నమ్మిన యువతులు అలాగే వచ్చి మోసపోయేవారని, వచ్చిన యువతులకు గురు దీనదయాళన్, ప్రియదర్శినిలు అన్న, చెల్లిగా పరిచయం చేసుకునేవారని తెలిసింది. ఇప్పటివరకు నిందితుడు 20 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడి 100 సవర్లకు పైగా నగలు దోచుకున్నట్లు సమాచారం.